మోడి ధైర్యమిదేనా ?

రాజకీయాల్లో ప్రత్యర్ధుల్లో ఐక్యత రానంత వరకు నరేంద్రమోడి ఫుల్లు హ్యాపీనే. ఈ విషయం తాజా రాజకీయాలను గమనిస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. నిజానికి ఎన్డీయే అధికారంలోనే ఉన్నా నేతృత్వం వహిస్తున్న బీజేపీని మినహాయిస్తే మిగిలిన పార్టీల బలం అంతంత మాత్రమే. అయితే యూపీఏ వ్యవహరం చూస్తే కాంగ్రెస్ తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీల బలం కూడా అంతంతమాత్రమే కావటంతో మోడి ఫుల్లు ఖుషీగా ఉన్నారు. అందుకనే జనాలకు కూడా ప్రత్యామ్నాయం లేక బీజేపీకే ఓట్లేసింది.

ఈ పరిస్ధితిని మార్చుదామని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్, మమతాబెనర్జీ లాంటి వాళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరికీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంధానకర్తగా ఉన్నారు. ప్రశాంత వ్యూహాలు తెరవెనకకు మాత్రమే పరిమితమవుతాయి కానీ క్షేత్రస్ధాయిలో నేరుగా అమలుచేయలేడు. అందుకనే శరద్ నివాసంలో 13 పార్టీల అధినేతలతో భేటీ ఏర్పాటంటు హడావుడి జరిగింది.

అయితే భేటీకి హాజరైంది ఎనిమిది పార్టీలు మాత్రమే. వీరిలో కూడా చెప్పుకోదగ్గ పార్టీలు ఎన్సీపీ, తృణమూల్, ఆప్ మాత్రమే. హాజరైన పార్టీలన్నీ చెప్పుకోవటానికి జాతీయ పార్టీలే కానీ వాటికి రాష్ట్రాల్లో కూడా చెప్పుకోతగ్గ బలం లేదు. ఇక వామపక్షాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదు.

ఎందకంటే పార్టీలన్నీ కలిపి ఒకవేళ కూటమి కట్టినా అన్నీ ప్రాంతీయ పార్టీలే కాబట్టి జాతీయ స్ధాయిలో ఎవరు నేతృత్వం వహిస్తారనే విషయంలో గొడవలు తప్పవు. ప్రాంతీయ పార్టీల్లో బలమైన ఎస్పీ, బీఎస్పీ, బీజూ జనతాదళ్ లాంటి పార్టీలు హాజరు కాలేదు. టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలు వాళ్ళతో చేతులు కలిపేది అనుమానమే. అంటే ఎన్డీయే ప్రత్యర్ధి కూటమి అయినా, ప్రత్యర్ధులైనా మోడికి వ్యతిరేకంగా జట్టుకట్టేది అనుమానమే.

అందుకే మోడి చాలా హ్యాపీగా ఉన్నది. అయితే మోడి పాలనపై జనాల్లో గనుక తీవ్రమైన వ్యతిరేకత ఉంటే మాత్రం బీజేపీకి డేంజర్ తప్పదనే చెప్పాలి. మొన్నటి పశ్చిమబెంగాల్లో వచ్చిన ఫలితాలే రాబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రిపీట్ అయితే దాని ప్రభావం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పడటం ఖాయమే. మరి జనాల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.