నటుడితో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన అవికాగోర్!

‘బాలికా వధు’ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయింది అవికా గోర్. ఇదే సీరియల్ ను తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అవికా గోర్ పెర్ఫార్మన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. నార్త్ తో పాటు తెలుగులో కూడా ఆమె క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన ‘ఉయ్యాలా జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

కెరీర్ విషయం పక్కన పెడితే.. అవికా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. మిలింద్ ఛద్వాని అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఎప్పటికప్పుడు తన బాయ ఫ్రెండ్ తో ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ఆమెకి సీరియల్ నటుడు మనీష్ రాయ్ సింఘన్ తో ఎఫైర్ ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉందని బాలీవుడ్ మీడియా వర్గాలు ప్రచురించాయి.

తాజాగా ఈ విషయంపై అవికా స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని తెలిపింది. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి మనీష్ తో స్నేహం ఏర్పడిందని.. అతడికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పింది. అతడి నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఇప్పటికీ తమ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా..? అని అందరు అడుగుతున్నారని వాపోయింది.

తన తండ్రి కంటే మనీష్ వయసులో కొంచెం చిన్నవాడని.. సరిగ్గా చెప్పాలంటే తన తండ్రి వయసే ఉంటుందని.. అలాంటి వ్యక్తితో సంబంధం ఉందని కథనాలు వస్తున్నాయని మండిపడింది. మొదట్లో ఈ వార్తలు చాలా ప్రభావం చూపించేవని.. దీంతో మనీష్ తో కొన్నాళ్లు మాట్లాడడం మానేశానని చెప్పింది. ఇప్పటికీ ఈ పుకార్లు వస్తూనే ఉండడంతో.. ఇక మాట్లాడకుండా ఉండడంలో అర్ధం లేదనిపించిందని స్పష్టం చేసింది. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చింది.