‘మా’ రభస.. అంతకుమించి


ఉన్నట్లుండి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒక్క రోజు వ్యవధిలో సమీకరణాలన్నీ మారిపోయాయి. ఈసారి ప్రకాష్ రాజ్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల రేసులోకి రావడంతో అందరి దృష్టీ ఇటు మళ్లింది. అంతలోనే మంచు విష్ణు ఈ పదవి కోసం పోటీ పడబోతున్నట్లు సమాచారం బయటికి రావడంతో ఆసక్తి రెట్టింపైంది. ఇది ఎవ్వరూ ఊహించని పోటీయే. గత రెండు పర్యాయాలు ‘మా’ ఎన్నికలు ఎంతగా రచ్చ లేపాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగేళ్ల కిందట రాజేంద్ర ప్రసాద్, జయసుధ ప్యానెల్స్ ఎన్నికల బరిలో నిలిచినపుడు.. ‘మా’ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఆరోపణలు ప్రత్యారోపణలు.. వాదోపవాదాలు నడిచాయి. ఇది టాలీవుడ్ ఇమేజ్‌ను దెబ్బ తీసింది. ఒక సినీ నటుల సంఘం ఎన్నికల గురించి ఇంత రభసేంటి అని జనాలు చికాకు పడే పరిస్థితి వచ్చింది.

ఇక రెండేళ్ల కిందట ఎన్నికల సందర్భంగానూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. నరేష్, శివాజీ రాజాల మధ్య జరిగిన గలాభా సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యాక ఒకే వర్గానికి చెందిన నరేష్, రాజశేఖర్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కి ‘మా’ ప్రతిష్ఠ దెబ్బ తింది. ఇకపై ఇలా జరగకూడదని చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు లాంటి పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఐతే ఇప్పుడిక మళ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రకాష్ రాజ్ ఇప్పటికే అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మంచు విష్ణు పోటీ పడటం దాదాపు ఖాయం అంటున్నారు. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఐతే ప్రకాష్ రాజ్ రాకతో ఎన్నికలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆటోమేటిగ్గా ఆయన నాన్ లోకల్ అనే వాదన తెరపైకి వచ్చేలా ఉంది. ఐతే ఈ వాదన తెస్తే ప్రకాష్ రాజ్ ఊరుకునే రకం కాదు. బలమైన వాయిస్ ఉన్న ఆయన.. తనను విమర్శించే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టరు.

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్‌కు ఇప్పటికే చిరంజీవి సపోర్ట్ ఉందంటున్నారు. నాగబాబు ఆయనకు ఓపెన్‌గానే సపోర్ట్ చేశారు కూడా. మరి తన మిత్రుడైన మోహన్ బాబు కొడుకు బరిలో నిలిస్తే చిరు.. ‘నాన్-లోకల్’ అయిన ప్రకాష్ రాజ్‌కు ఎలా మద్దతిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఎవరితోనూ కయ్యం పెట్టుకోవడానికి, శత్రుత్వం పెంచుకోవడానికి ఇష్టపడని చిరు.. మధ్యలో తలెత్తిన అగాథాన్ని పూడ్చుకుని మోహన్ బాబుతో ఎంతో సఖ్యంగా ఉంటున్న చిరు.. ఈ దశలో ప్రకాష్ రాజ్‌కు మద్దతిస్తే మళ్లీ వారి మధ్య అంతరం రావడం ఖాయం. మరోవైపు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల పోటీ నేపథ్యంలో ఇండస్ట్రీ కూడా రెండుగా చీలిపోయే పరిస్థితీ కనిపిస్తోంది. చూస్తుంటే గత రెండు పర్యాయాల కంటే ఈసారి ‘మా’ ఎన్నికల రచ్చ పతాక స్థాయికి చేరేలాగే కనిపిస్తోంది.