కేసీఆర్ కాళ్లు మొక్కిన‌ క‌లెక్ట‌ర్లు.. రీజ‌నేంటి?

పెద్ద‌ల పాదాల‌కు న‌మ‌స్కారం చేయ‌డం అనేది మ‌న సంస్కృతి. ఇక ఇది రాజ‌కీయాలు, సినీ రంగం.. వంటి ప‌లు రంగాల‌కు ఎగ‌బాకింది. కానీ, జిల్లాల‌కు అధికారులు అయిన క‌లెక్ట‌ర్లు సీఎంల‌ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌డం అనేది ఉండ‌దు. కానీ, తెలంగాణ‌లో మాత్రం తాజాగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్‌ భవనాల ప్రారంభం సందర్భంగా ఆ జిల్లాల కలెక్టర్లు వెంకట్రామారెడ్డి, శరత్‌.. సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లను వారి చాంబర్‌లోని సీట్లో కూర్చోబెట్టగా.. వారు సీఎం పాదాలకు నమస్కరించారు.

పాదాల‌కు న‌మస్కారం చేయ‌డంపై కలెక్టర్ల చర్య విమర్శల పాలైంది. ఐఏఎస్‌ అధికారులై ఉండి.. ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించడమేంటని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్తువెత్తాయి. దీంతో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఈ విమర్శలపై వివరణ ఇచ్చారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమన్నారు. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అధికారిగా, నూతన కలెక్టరేట్‌లో తనకు భాధ్యతలు అప్పగించి ఆశీర్వదిస్తున్న క్రమంలో తండ్రి సమానుడైన సీఎం నుంచి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

అయితే.. ఈ విష‌యంపై మాత్రం రాజ‌కీయ దుమారం రేగుతూనే ఉంది. కేసీఆర్‌.. ఇదంతా కావాల‌నే చేశారంటూ.. కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అధికారుల‌ను త‌న చెప్పు చేత‌ల్లో ఉంచుకునేందుకు ఇలా చేయించార‌ని.. దుయ్య‌బ‌డుతున్నారు. మ‌రికొంద‌రు స‌ద‌రు అధికారులు.. త్వ‌ర‌లోనే వీఆర్ ఎస్ తీసుకుని.. రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నారేమో.. అంటూ పెద‌వి విరుస్తున్నారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం వైపు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటివివ‌ర‌ణా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తుందో చూడాలి.