మోడీని నిల‌దీస్తున్న ప్ర‌పంచం.. స‌మాధానం చెప్ప‌క త‌ప్ప‌లేదు..

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌పంచ దేశాల ముందు చేతులు క‌ట్టుకున్నారా? కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఒక నిర్ణ‌యంపై ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారా? ఈ క్ర‌మంలోనే ఏకంగా ఐక్య‌రాజ్య‌స‌మితి సైతం మోడీ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించిందా? దీంతో ఆయ‌న స‌మాధానం చెప్ప‌క త‌ప్ప‌లేదా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. దేశంలో సోష‌ల్ మీడియా వేదిక‌లుగా ఉన్న ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్‌.. స‌హా అనేక మాధ్య‌మాల్లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, రెచ్చ‌గొట్ట‌డం, స‌మాజంలో ఉద్రిక్త‌త‌లు సృష్టిస్తున్నార‌నే కార‌ణంగా.. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త ఐటీ నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది.

ఆ వెంట‌నే ట్విట్ట‌ర్‌పై కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంది. ఇది గ‌త వారం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ట్విట్ట‌ర్‌కు, కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ వివాదం ప్ర‌పంచ దేశాల దృష్టికి చేరింది. ఆ వెంట‌నే కేంద్రం ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనల పట్ల ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్ర‌మంలోనే “అస‌లు భార‌త్‌లో ఏం జ‌రుగుతోందో చెప్పాలి?” అంటూ.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి మోడీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. దీంతో త‌ప్ప‌ని ప‌రిస్థితిలో మోడీ ప్ర‌భుత్వం ఐక్య‌రాజ్య‌స‌మితికి వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.

సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం అవుతున్నట్టు పలు ఉదంతాలు వెలుగు చూడటంతో కొత్త ఐటీ నిబంధనలు తేవాల్సిన అవసరం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలికి మోడీ స‌ర్కారు తాజాగా తెలిపింది. ఉగ్రవాదం, అశ్లీలత, ఆర్థిక అవకతవకలు, హింసను రెచ్చగొట్ట‌డం వంటి నేరాలకు కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా దోహదపడిందని కేంద్రం పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలోని భారత్‌ పర్మెనెంట్ మిషన్ కి లేఖ రాసింది.

సోషల్ మీడియా సాధారణ వినియోగదారుల రక్షణ కోసం ఈ నిబంధనలు తెచ్చామని కేంద్రం ఈ లేఖ‌లో పేర్కొంది. అంతేకాకుండా.. ‘సోషల్’ బాధితులు సమస్యలను పరిష్కరించేందుకు ఓ గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ అవసరముందని కూడా అభిప్రాయపడింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అవసరమైన వ్యవస్థలను నెలకొల్పాలన్న భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను కూడా కేంద్రం తన లేఖలో ప్రస్తావించింది. అయితే.. ఈ విష‌యంపై ఐక్య‌రాజ్య‌స‌మితి తీవ్రంగా స్పందిస్తే.. అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల బృందాన్ని భార‌త్‌కు పంపించే అవ‌కాశం ఉంద‌ని.. మోడీ స‌ర్కారు చెబుతున్న అంశాల‌పై అధ్య‌య‌నం చేయించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. గ‌తంలో పాకిస్థాన్‌లోనూ ఇలానే జ‌రిగితే.. ఐక్య‌రాజ్య‌స‌మితి తీవ్రంగా స్పందించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.