సీరియస్‌గా వ్యవసాయంలోకి దిగిపోయిన స్టార్

సినీ తారలు బాగా సంపాదించాక నగర శివార్లలో ఫామ్ హౌస్‌లు కొనుక్కోవడం.. అక్కడో చిన్న ఇల్లు కట్టుకుని వీకెండ్స్‌లో వెళ్లి రావడం.. మనుషుల్ని పెట్టి వ్యవసాయం చేయించడం.. పళ్ల తోటలు పెంచడం మామూలే. ఐతే చాలామంది స్టార్లు సరదాగా అలా వెళ్లి వస్తుంటారు తప్పితే తామే రంగంలోకి దిగి వ్యవసాయం చేయరు. కొందరు మాత్రమే ఇందుకు మినహాయింపుగా ఉంటారు. గత ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. మహారాష్ట్రలోని తన వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఐతే అదంతా ఫొటో షూట్ కోసం చేసిన సెటప్ లాగా కనిపించింది. ఐతే బాలీవుడ్‌లోనే స్టార్ నటుడైన నవాజుద్దీన్ సిద్ధిఖి మాత్రం ఇలా కాకుండా సీరియస్‌గా వ్యవసాయంలోకి దిగిపోవడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో గత ఏడాది, అలాగే ఇప్పుడు ఆయన సీరియస్‌గా వ్యవసాయం చేస్తున్నాడు.

నవాజుద్దీన్ వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినవాడే. వాళ్ల కుటుంబంలో చాలామంది ఇప్పటికీ వ్యవసాయమే చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే బుదానాలో నవాజ్‌కు పొలాలున్నాయి. కరోనా-లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో నవాజ్ గత ఏడాదే అక్కడికి వెళ్లిపోయాడు. మధ్యలో కొన్ని నెలలు చిత్రీకరణలు జరిగినపుడు తిరిగి ముంబయికి వచ్చాడు. కానీ మళ్లీ లాక్ డౌన్ రావడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడ చాలా సీరియస్‌గా అతను వ్యవసాయం చేస్తున్నాడు. తనే పొలంలోకి దిగి ఒక మామూలు రైతులా పనులు చేసుకుంటున్నాడు. అతడి ఆధ్వర్యంలోనే పంటలు కూడా వేశారు.

లాక్ డౌన్ షరతులు కొంత సడలించి బాలీవుడ్లో షూటింగ్స్ పున:ప్రారంభం అయినప్పటికీ ఈసారి నవాజ్ వెంటనే ముంబయికి రాలేదు. ఇంకొ కొన్ని నెలలు తాను షూటింగ్‌ల్లో పాల్గొనబోనని.. తన గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయాలనుకుంటున్నానని.. పంటలు పూర్తయి చేతికొచ్చే వరకు ఇక్కడి నుంచి రానని ఓ మీడియా సంస్థకు నవాజ్ చెప్పడం విశేషం.