షాకింగ్: 3 డాక్టర్లు, 26 మంది నర్సులకు కరోనా

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్న చిగురుటాకులా వణికిపోతున్నాయి. పేద దేశం, ధనిక దేశం, అగ్ర రాజ్యం, అనామక దేశం….అంటూ తేడా లేకుండా కరోనా తన కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.75 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 69,500 మంది మృత్యువాత పడ్డారు. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు భారత్ లో 4067 వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా….మరణాల సంఖ్య 117కు చేరుకుంది. మొత్తం 4067 వేల కేసుల్లో 1000 కేసులకు ఢిల్లీ లింక్ ఉంది. ఇక, తాజాగా మన దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో  కరోనా దెబ్బకు ఏకంగా ఒక ఆసుపత్రిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ ఆసుపత్రి మొత్తాన్ని క్వారంటైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గుర్తించిన హాట్ స్పాట్ లలో వోకార్డ్ ఆసుపత్రి ఒకటి.

ముంబైలోని వోకార్డ్‌ ఆసుపత్రిలో 29 మంది వైద్య సిబ్బందికి కరోనాసోకడంతో కలకలం రేగింది. 26 మంది నర్సులు, ముగ్గురు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు…ఆ ఆసుపత్రిలో కరోనా వ్యాప్తికి గల కారణాలేమిటో తెలుసుకునే పనిలో పడ్డారు.  ఆ ఆసుపత్రి నుంచి ఎవరినీ బయటకు పంపకుండా, ఎవరినీ లోనికి అనుమతించకుండా నిషేధం విధించారు.

ఇప్పటికే అందులో చికిత్స పొందుతున్న రోగులను కూడా కూడా బయటకు వెళ్లకూడదని నిబంధలను విధించారు. ఆ ఆసుపత్రిలోని రోగులందరికీ రెండు సార్లు కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఆ ఆసుపత్రిలో 270 మంది రోగులు, నర్సులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ఆసుపత్రిలో ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలనూ నిలిపివేశారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన 745 కేసుల్లో 458 కేసులు ముంబైలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.