‘హలో.. మీరు కరోనాతో చనిపోయారు..!’

ఎవరైనా మీకు ఫోన్ చేసి.. మీరే చనిపోయారని చెబితే ఎలా ఉంటుంది..? ఓ యువకుడి విషయంలో అదే జరిగింది. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య.. బతుకు జీవుడా అనుకుంటున్న ఓ యువకుడికి.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.

ఆ ఫోన్ లో.. తాను చనిపోయానంటూ.. సదరు ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. అంతే.. బతికున్న తనని చనిపోయారంటూ చెప్పడంతో.. సదరు యువకుడికి మండిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. కాగా.. విషయం కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఏళ్ల సిద్ధాంత్ మిలింద్ భోస్లే గత నెల కరోనా బారిన పడ్డాడు. అతనొక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు కూడా. అయితే.. ఈ సోమవారం అతనికి ప్రభుత్వాస్పత్రి నుంచి తాను కరోనాతో మరణించినట్లు ఫోన్ వచ్చింది.

ఈ విషయం విన్న మిలింద్ షాక్‌కు గురై తన తల్లి సప్నాకు ఫోన్ ఇచ్చాడు. సదరు ఆసుపత్రి సిబ్బంది ఆమెకూ అదే విషయాన్ని తెలపగా.. కంగారు పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈ అంశంపై ఆరా తీశారు. కానీ.. తమకు వచ్చిన జాబితా ప్రకారమే ప్రజలకు సమాచారం అందిస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని సప్నా వివరించారు.

తాను ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. అలాంటిది తనకు ఫోన్ చేసి తానే చనిపోయానంటూ వారు చెప్పడం షాకింగ్ కి గురి చేసిందని సదరు యువకుడు పేర్కొన్నాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండొచ్చని అంటుండగా.. మరికొందరు ప్రభుత్వాసుప్రతుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.