బన్నీని వదలనంటున్న ఆ దర్శకుడు

అల్లు అర్జున్‌తో ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక సినిమా చేయడానికి రెండేళ్ల కిందట గట్టిగా ప్రయత్నం చేయడం గుర్తుండే ఉంటుంది. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ విక్రమ్ సినిమానే చేయాల్సింది. కొన్ని నెలల పాటు వీరి మధ్య కథా చర్చలు జరిగాయి. ఓ కథకు బన్నీ పచ్చజెండా ఊపేశాడని.. ఇక సినిమా మొదలవడమే తరువాయి అన్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో.. ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసేశాడు బన్నీ. అతను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టగా.. విక్రమ్ ఏమో నానీతో ‘గ్యాంగ్ లీడర్’ తీశాడు. ఆ చిత్రాల ఫలితాలు తెలిసిందే.

బన్నీ విక్రమ్ సినిమాను క్యాన్సిల్ చేసుకుని మంచి పని చేశాడని, లేకుంటే నాన్ బాహుబలి హిట్ మిస్సయ్యేవాడని అభిమానులు అనుకున్నారు. ఇక మళ్లీ విక్రమ్‌తో బన్నీ సినిమా ఉండదనే అంతా భావించారు. విక్రమ్ కూడా మళ్లీ బన్నీతో సినిమా కోసం ప్రయత్నం చేయడనే అనుకున్నారు. కానీ విక్రమ్ ఆలోచన మాత్రం మరోలా ఉంది.

ఒకసారి వద్దు అనిపించుకున్నాక కూడా బన్నీతో సినిమా చేసే ఆలోచనను విక్రమ్ విరమించుకోలేదు. బన్నీతో సినిమా చేసి తీరుతానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు విక్రమ్. అల్లు హీరో కోసం మరో కథ రాస్తున్నానని.. ఆ పని మధ్యలో ఉందని.. బన్నీతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని.. సరైన సమయంలో ఈ చిత్రం పట్టాలెక్కుతుందని విక్రమ్ చెప్పాడు. ఇక ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అయితే.. ప్రస్తుతం బన్నీతో ‘పుష్ప’ తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లోనే విక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట.

ఇదే బేనర్లో విక్రమ్ ‘గ్యాంగ్ లీడర్’ చేయడం తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్యతో తీస్తున్న ‘థ్యాంక్ యు’ పూర్తయ్యాక బన్నీ సినిమా మీద పూర్తి స్థాయిలో విక్రమ్ పని చేయనున్నాడట. ‘థ్యాంక్ యు’ 90 శాతానికి పైగా పూర్తయిందని, ఇంకో పది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని.. ఆ పనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగించి ఆగస్టు తొలి వారానికి సినిమాను నిర్మాత దిల్ రాజు చేతిలో పెడతానని విక్రమ్ అన్నాడు.