దేశమంతా కరోనా భయంలో ఉండగా..

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి దృష్టి కరోనా వైరస్ మీదే ఉంది. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి. ప్రధాన మంత్రి సహా మంత్రి వర్గం అంతా దీని మీదే దృష్టిసారించింది. సైన్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొంతమంది సిబ్బందిని విధుల నుంచి దూరం పెట్టారు.

ఇలాంటి సమయంలో ఇండియా మీద దాడి చేయడం తేలికని భావించిన ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి ఇండియాలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. కశ్మీర్లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి.

ఆదివారం ఉదయం కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు వెల్లడైంది. ఈ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను గుర్తించిన సైనికులు వెంటనే కాల్పులు జరిపారు. ఆ ఐదుగురూ హతమైనట్లు నిర్ధరించారు.

ఐతే ఎదురు కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు పౌరులు మృతి చెందడంతో.. సైన్యం ఆపరేషన్ చేపట్టింది. బత్ పురా వద్ద శనివారం రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది.

నియంత్రణ రేఖ సమీపంలో మరింతమంది ముష్కరులు దాగి ఉన్నారన్న అనుమానాలతో అక్కడ కూంబింగ్ చేపడుతోంది సైన్యం. ఉగ్ర ముప్పును దృష్టిలో ఉంచుకుని సెలవు ఇచ్చిన సైనికులందరినీ తిరిగి విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.