సుక్కు మాటకు బాలు ఉప్పొంగిన వేళ..

భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. 40 వేల సినిమా పాటలు పాడటం.. ఒక్క రోజులో 21 పాటలు రికార్డ్ చేయడం లాంటి కొన్ని ఘనతలు చాలు.. బాలు ఒక అసామాన్య గాయకుడు అని చెప్పడానికి. కోట్లాదిమంది అభిమానులకు ఆయన పంచిన ఆనందం, అనుభూతి గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన భారతీయ సంగీతానికి చేసిన సేవకు ఎంత గొప్ప పురస్కారం ఇచ్చినా తక్కువే.

చనిపోవడానికి ముందు పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న ఆయన్ని మరణానంతం పద్మవిభూషణ్ వరించింది. ఐతే బాలుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలన్నది ఆయన అభిమానుల కోరిక. ఏ రకంగా చూసినా ఆయన అందుకు అర్హుడు అనడంలో సందేహం లేదు. ఐతే అభిమానులు ఆయనకు పురస్కారాలు ఇవ్వాలని కోరుకుంటారు కానీ.. అవార్డుల గురించి బాలు ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నది లేదు.

ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులను మించి అభిమానులు చూపించే ప్రేమ, వాళ్లిచ్చే కితాబులు తనకు అతి పెద్ద పురస్కారాలని బాలు అంటుంటారు. ఎంతోమంది దిగ్గజాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్న బాలు.. ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్‌కు ఉబ్బితబ్బిబ్బయిపోవడం విశేషం. సుక్కు చేసిన ఒక వ్యాఖ్య.. పది పద్మభూషణ్‌లతో సమానమని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. బాలు హోస్ట్‌గా వ్యవహరించే ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంకు చాలా ఏళ్ల కిందట సుకుమార్ అతిథిగా విచ్చేశాడు.

ఆ సందర్భంగా బాలు పాట జనాలపై చూపించే ప్రభావం గురించి సుక్కు మాట్లాడాడు. తన బాల్యం, యవ్వనం, ఆ తర్వాతి జీవితం అంతా కూడా బాలు పాటలతోనే గడిచిందని.. ఇలా కోట్లాదిమంది జీవితాల్లో బాలు పాట భాగం అయిపోయిందని సుక్కు అన్నాడు. బాలు ఐదు నిమిషాలు పాట పాడి తన పని ముగించేస్తారని.. కానీ ఆయన పాటలను జనాలు మళ్లీ మళ్లీ వింటూ తమ జీవితాల్లో చాలా సమయాన్ని అందు కోసమే ఇచ్చేస్తారని.. ఆ రకంగా బాలు వేరే వాళ్ల జీవితాలను కూడా తాను జీవించేస్తాడని సుక్కు అన్నాడు.

ఈ కామెంట్ విని ఆశ్చర్యపోయిన బాలు.. వేరే వాళ్ల జీవితాలను మనం జీవించడం అనే ఎక్స్‌ప్రెషన్ తాను ఇప్పటిదాకా ఎప్పుడూ వినలేదని.. ఇది తనకు దక్కిన గొప్ప కాంప్లిమెంట్ అని.. దీన్ని పది పద్మభూషణ్‌లతో సమానంగా భావిస్తానని వ్యాఖ్యానించడం విశేషం. బాలు జయంతి నేపథ్యంలో ఈ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్న చాలా వీడియోల్లో ఇది కూడా ఒకటి.