మైనర్ రేప్ కేసులో టీవీ నటుడు

సినిమాల్లో, టీవీ షోల్లో వెలిగిపోవాలని ఆశపడే అమ్మాయిల నుంచి అడ్వాంటేజ్‌గా తీసుకుని వారి నుంచి సెక్సువల్ ఫేవర్లు కోరడం.. వేధించడం లాంటి ఉదంతాల గురించి తరచూ వింటుంటాం. ఇలాంటి వాటి గురించి గతంలో బహిరంగ చర్చ జరిగేది కాదు. అమ్మాయిలు వీటి గురించి నోరు విప్పడమూ తక్కువే.

ఐతే మూడేళ్ల కిందట ‘మీ టూ’ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అమ్మాయిలు తమపై జరిగే అఘాయిత్యాలు, వేధింపుల గురించి బయటికి చెప్పడానికి కాస్త ధైర్యం చేస్తున్నారు. కేసులు కూడా పెడుతున్నారు. ఇటీవలే భార్గవ్ అనే యూట్యూబర్ వల్ల గర్భం దాల్చిన ఓ మైనర్ బాలిక కేసు పెట్టడం తెలిసిందే. ఇప్పుడు హిందీ టీవీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన పెర్ల్ వి.పూరి అనే ఆర్టిస్టు ఇలాంటి ఆరోపణలతోనే అరెస్టయ్యాడు. ఓ మైనర్ బాలిక పెట్టిన రేప్ కేసులో భాగంగా ముంబయి పోలీసులు పెర్ల్‌ను శనివారం అరెస్టు చేశారు.

టీవీ కార్యక్రమాల్లో అవకాశాల కోసం పెర్ల్‌ను కలిస్తే అడ్వాంటేజ్ తీసుకుని తనను లైంగికంగా వాడుకున్నాడని, అత్యాచారం జరిపాడని ఓ మైనర్ బాలిక పెర్ల్ మీద ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పెర్ల్ మీద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద కేసు పెట్టి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పెర్ల్‌తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

నాగిన్ 3, నాగార్జున ఏక్ యోధా, నజర్ సే కుబ్‌సూరత్, బేపనా ప్యార్ లాంటి టీవీ కార్యక్రమాలతో పెర్ల్ వి.పూరి పాపులర్ అయ్యాడు. టీవీ ఇండస్ట్రీలో అతను పెద్ద స్టార్ అనే చెప్పాలి. ఇంత పేరున్న నటుడు ఇలా మైనర్ బాలిక రేప్ కేసులో అరెస్ట్ కావడం అభిమానులకు మింగుడు పడటం లేదు. ఐతే నాగిన్ 3లో పెర్ల్ కోస్టార్ అయిన అనిత హస్సానందని మాత్రం.. పెర్ల్ చాలా మంచోడని, అతడిపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని పేర్కొంటూ ట్వీట్ వేసి అతడికి మద్దతుగా నిలిచింది. ఇండస్ట్రీలో మిగతా వాళ్లు పెర్ల్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.