స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్న ఈటల ?

తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మాజీమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉంది. నిజానికి రాజీనామా ఆమోదం కోసం ఈటల ఎవరిపైనా ఒత్తిడి తేవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈటల ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారా అన్నట్లుగా అధికార టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిస్దితుల్లో రాజీనామా ఆమోదానికి ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముంటుంది ?

ఎంఎల్ఏగా రాజీనామా చేసిన ఈటల స్పీకర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారట. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పీకర్ అందుబాటులోకి రాలేదట. అందుకనే ఫ్యాక్స్ ద్వారా తాను పంపిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాజేందర్ కోరుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజేందర్ రాజీనామాను కోరుకుంటున్న టీఆర్ఎస్ ఇదే సమయంలో ఆయనకు సానుభూతి రాకూడదని కోరుకుంటోంది.

అయితే తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరుకుంటున్న ఈటల దానిద్వారా ప్రజల సానుభూతి రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకవైపు ఈటల వర్గం, మరోవైపు టీఆర్ఎస్ నేతలు మోహరించారు. ఈటలకు మద్దతుగా పార్టీ నుండి ఏ స్ధాయి నేతలు కూడా బయటకు వెళ్ళకూడుండా చూడాలనే పట్టుదలతో కేసీయార్ ఉన్నారు. దాన్ని తూచా అమలు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు.

కేసీయార్ ఆదేశాలతో చాలామంది నేతలు నియోజకవర్గంలోనే కొద్దిరోజులుగా క్యాంపు వేసున్నారు. ఇదే సమయంలో ఈటలకు మద్దతు కూడగట్టేందుకు ఆయన అనుచరులు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేసీయార్ వ్యతేరుకులందరినీ కలుస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో ఎప్పుడేమి జరుగుతుందో అర్దంకావటంలేదు. ఈ నేపద్యంలో రాజీనామా ఆమోదం వ్యవహారం కూడా వేడెక్కిస్తోంది.

మామూలుగా అయితే రాజీనామా చేసిన ఎంఎల్ఏతో స్పీకర్ ప్రత్యక్షంగా సమావేశమవుతారు. రాజీనామాకు దారితీసిన పరిస్ధితులను, ఎంఎల్ఏనే రాజీనామా చేశారా అనే అంశాలను నిర్ధారించుకుంటారు. మరిపుడు ఈటల విషయంలో ఏమి జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. విచిత్రమేమిటంటే పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారని శుక్రవారమే ఈటల ప్రకటించేశారు. అయితే రాజీనామాకు మంచిరోజు చూస్తున్నారని శనివారం ఓ సెక్షన్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. ఇంతకీ రెండింటిలో ఏది కరెక్టు ?