ఈటలను వెంటాడుతున్న గతం..?

Eetela Rajendra

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి టీఆర్ఎస్ తో అనుబంధం తెగిపోయింది. ప్రస్తుతం ఆయన బీజేపీతో తన కొత్త అధ్యయనాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. టీఆర్ఎస్ ని వీడి.. బీజేపీలోకి అడుగుపెడుతున్న ఆయనకి.. గతాన్ని గుర్తుచేస్తూ.. నెట్టింట గులాబీ అభిమానులు ఎటాక్ చేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే… ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవితోపాటు… టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సమయంలో… ఈటల.. సీఎం కేసీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ లను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. అయితే.. అలా కేసీఆర్ పై విమర్శలు చేయడాన్ని టీఆర్ఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే… ఈటలను నెట్టింట టార్గెట్ చేశారు. గతంలో.. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ లకు మద్దుతుగా.. బీజేపీ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

‘ కేసీఆర్.. ముదిరాజ్ ల తల్లిపాలు తాగి పెరిగారు. ఆ ప్రేమతోనే ముదిరాజ్ ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకూ ఓ కేసీఆర్ ఉంటే బాగుండని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదు. కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ భూస్థాపితం అవుతుంది’ అంటూ గతంలో ఈటల మాట్లాడిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తుండటం గమనార్హం.

ఇక ఎంపీ సంతోష్ కుమార్ పై కూడా ప్రశంసలు కురిపించిన వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలను షేర్ చేస్తూ.. ఇవి మీరు చెప్పిన మాటలే ఈటల సార్.. మరి వీటికి సమాధానమేంది..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీడియోలకు ఈటల కౌంటర్ ఎటాక్ ఇస్తారా.. లేదా.. స్తబ్దుగా ఉండిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.