డీవీవీ దానయ్యతో ప్రశాంత్ నీల్..?

‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యష్ కు స్టార్ స్టేటస్ లభించింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘కేజీఎఫ్ 2’ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఓ తెలుగు సినిమాను డైరెక్ట్ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమాను ఖరారు చేసుకున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. దీని తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాల్సివుంది. ఆ తరువాతే ప్రశాంత్ నీల్ కి డేట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య.. ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వాటికి మరింత బలం చేకూరేలా ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

దీంతో ఈ సంస్థ నుండి ప్రశాంత్ నీల్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ అందిన మాట నిజమేనని అంటున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సైతం ‘మీ కాంబోలో సినిమా ఎప్పుడు..? హీరోని ఫైనల్ చేశారా..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొదటి నుండి కూడా దానయ్య ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లకు అడ్వాన్స్ లు ఇస్తూ ముందుగానే వాళ్లను లాక్ చేస్తుంటారు. రాజమౌళి విషయంలో కూడా ఇలానే చేశారు. చాలా ఏళ్ల క్రితం రాజమౌళి కి అడ్వాన్స్ ఇవ్వగా.. ఇప్పటికి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. ప్రశాంత్ నీల్ కు కూడా అలానే అడ్వాన్స్ ఇచ్చి భవిష్యత్తులో సినిమా చేసే విధంగా హామీ తీసుకున్నట్లు సమాచారం.