‘నారప్ప’ కొట్టు.. పవన్ సినిమా పట్టు

‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమా తీసిన తరువాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం పట్టింది. తమిళంలో సక్సెస్ అందుకున్న ‘అసురన్’ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా కథలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ లాంటి ప్రాజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయంలో చాలా మందికి సందేహాలు కలిగాయి. కానీ ఇప్పటివరకు విడుదలైన ఫోటోలు, మోషన్ పోస్టర్లు చూసిన వారికి సినిమా బాగా వచ్చి ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.

దీంతో ‘కర్ణన్’ రీమేక్ కోసం కూడా శ్రీకాంత్ అడ్డాలను తీసుకోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి కథ చెప్పమని అడిగారట. గతంలో దిల్ రాజు-శ్రీకాంత్ అడ్డాల కలిసి రెండు సినిమాలకు పని చేశారు. ఆ రెండూ కూడా మంచి విజయాలను సాధించాయి. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడొక సమస్య ఉంది.

అదేంటంటే.. శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం క్రితం గీతాఆర్ట్స్ సంస్థ నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ‘నారప్ప’ తరువాత తమతో సినిమా చేయమని గీతాఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ అడ్డాలను అడుగుతుందట. దీంతో ప్రస్తుతం ఆయన ఏ నిర్మాణ సంస్థకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఇదే విషయం దిల్ రాజుకి కూడా చెప్పినట్లు సమాచారం. ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకొని తన బ్యానర్ లో సినిమాకి రెడీ అవ్వమని సలహా ఇచ్చారట దిల్ రాజు. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా ఆఫర్ చేయడం విశేషం. శ్రీకాంత్ గనుక తన కథతో మెప్పిస్తే సినిమా పట్టాలెక్కడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!