నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు?


తెలుగులో దర్శక నిర్మాతలతో చాలా చక్కగా వ్యవహరిస్తాడని పేరున్న కథానాయకుల్లో శర్వానంద్ ఒకడు. అతడి చుట్టూ ఇప్పటిదాకా దాదాపు ఎలాంటి వివాదాలు లేవు. శర్వా గురించి అతడి పరోక్షంలోనూ అందరూ చాలా బాగా మాట్లాడతారు. నిర్మాతలు అతణ్ని ఆకాశానికెత్తేస్తుంటారు. అలాంటి నటుడికి ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నిర్మాతలతో వివాదం నెలకొందని.. తనకు రావాల్సిన పారితోషకం పెండింగ్ పెట్టడంతో లీగల్ నోటీసులు ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లిందని వార్తలొస్తున్నాయి.

శర్వా చివరి సినిమా ‘శ్రీకారం’ను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతోనేనట ఈ వివాదం. ఉదాత్తమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి మంచి రివ్యూలు కూడా తెచ్చుకున్న ‘శ్రీకారం’ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నందుకోలేకపోయింది. నిర్మాతలకు కాస్త ఎక్కువగానే నష్టాలు తెచ్చిపెట్టింది. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదని సమాచారం.

కాగా శర్వాకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రెమ్యూనరేషన్లో రూ.2 కోట్లు పెండింగ్ పెట్టారట నిర్మాతలు. రిలీజ్ తర్వాత ఈ డబ్బులు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు. ఐతే సినిమా కమర్షియల్‌ సక్సెస్ కాక 14 రీల్స్ అధినేతలకు బాగా నష్టాలు తేవడంతో శర్వాకు బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వలేదట. దీని గురించి శర్వా మళ్లీ మళ్లీ అడుగుతున్నా వారి నుంచి స్పందన లేదట. దీంతో అతను లీగల్ నోటీసు ఇవ్వక తప్పలేదని అంటున్నారు. ఈ విషయంలో ఎవరిది తప్పో చెప్పడం కష్టం.

సినిమా ఎలాంటి ఫలితాన్నందుకున్నా దాంతో సంబంధం లేకుండా నటీనటులకు చెప్పిన ప్రకారం రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని కొందరంటారు. అదే సమయంలో నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకుని బ్యాలెన్స్ పేమెంట్ వదులుకోవాల్సిందని ఇంకొందరంటారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా విషయంలోనే ఇలాంటి వివాదమే తలెత్తి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్.. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు అప్పట్లో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శర్వా ఇలా చేయడం చిత్రమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.