వైరల్ అయిన గ్యాంగ్ రేప్ జరిగింది బెంగళూరులో

సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనంగా మారటమే కాదు.. మరీ ఇంత దారుణమా అన్న చర్చకు తెర తీసిన గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగిందో తేల్చటమే కాదు.. బాధితురాలు ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన యువతిని.. ఆ దేశానికి చెందిన వారే చిత్ర హింసలకు గురి చేసి సామూహిక అత్యాచారం చేయటం.. ఈ దారుణ ఉదంతంలో ఇద్దరు అమ్మాయిలు యువకులకు సహకారాన్ని అందించటం షాకింగ్ గా మారింది. ఈ మొత్తం ఉదంతం ఈశాన్య రాష్ట్రమైన అసోంలో జరిగినట్లుగా ప్రచారం జరిగినా.. ఇది జరిగింది గార్డెన్ సిటీగా పేరున్న బెంగళూరులో జరిగినట్లుగా గుర్తించారు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో అటు బంగ్లాదేశ్ లోనూ.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వైరల్ గా మారి పెను సంచలనమైంది. అసోం పోలీసులు బెంగళూరు పోలీసుల్ని అలెర్టు చేయటంతో.. నగరంలోని రామ్మూర్తి నగర ఎన్ఆర్ ఐ లేఔట్ లోని ఒక ఇంట్లో ఈ అమానుష ఘటన జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు యువకులతో పాటు.. ఇద్దరు యువతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా.. బంగ్లాదేశ్ కు చెందిన వారేనని.. అక్రమంగా దేశ సరిహద్దులు దాటి బెంగళూరులో మకాం వేసినట్లుగా గుర్తించారు.

నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా ఇద్దరిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ గ్యాంగ్ రేప్ లో బాధితురాలైన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఆమె కేరళలో ఉన్నట్లుగా తేలింది.

వెంటనే స్పందించిన పోలీసులు కేరళకు వెళ్లి ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చారు. దేశ సరిహద్దులు దాటేసి.. దర్జాగా ఒక మహానగరంలో తిష్ట వేసిన వైనం చూస్తే.. ఈ లెక్కన దేశంలోని మహానగరాల్లో ఇలా అనుమతి లేని వారెందరన్న సందేహాం రాక మానదు. మరి.. ఇలాంటి వారిని గుర్తించే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? అన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.