అమెజాన్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ప్ర‌ధాని మోడీ పుస్త‌కం

మీడియా, సోష‌ల్ మీడియాలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఎంత‌గా పాపుల‌ర్ అనే విష‌యం చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, క‌రోనా స‌మ‌యంలో మోడీ ఇమేజ్ మ‌స‌క‌బారింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఓ పుస్త‌కం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గురించి ఉన్న ఆ పుస్త‌కం అమెజాన్‌లో అమ్మ‌కాని పెట్ట‌డం, వెనువెంట‌నే తొల‌గించ‌డం కూడా జ‌రిగిపోయింది. దీంతో ఏంటి ఆ పుస్త‌కం ప్ర‌త్యేక‌త అంటూ ప‌లువ‌రు సెర్చ్ చేస్తున్నారు.

మాస్టర్‌స్ట్రోక్‌ : 420 సీక్రెట్స్‌ దట్‌ హెల్ప్‌డ్‌ పీఎం ఇన్‌ ఇండియాస్‌ ఎంప్లారుమెంట్‌ గ్రోత్‌ పేరుతో అమెజాన్‌లో పోస్ట్ అయిన ఈ పుస్త‌కాన్ని బేరోజ్‌గార్‌ భక్త్‌ అనే వ్య‌క్తి ర‌చించార‌ని అమెజాన్ లో ఉన్న ఆ పోస్ట్ తెలుపుతోంది. ఇందులోని పేజీల సంఖ్య 56. ఈ- బుక్‌ ధర రూ.56. ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసి చదవాల‌ని భావించిన వారికి షాక్ ఖాయ‌మే. ఔను ఆ పుస్తకంలో పేజీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. అవును. అన్నీ తెల్ల కాగితాలే ఈ పుస్త‌కంలో ఉన్నాయి. అయితే, పుస్తకం కింద డిస్క్రిప్షన్‌లో రచయిత ఓ స‌మాచారం ఇచ్చారు. “నిరుద్యోగం, కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంటే… దేశాన్ని కాపాడిన మహానేత ప్రధాని మోడీ! దేశంలో ఉద్యోగ అవకాశాల్ని పెంచడానికి ప్రధాని మోడీ ఏం చేశారన్నది ఈ పుస్తకంలో ఉంది” అని పేర్కొన్నారు!

కరోనా సంక్షోభం దెబ్బకు దేశం విలవిల్లాడుతుంటే, ఏమీ పట్టనట్టగా.. మోడీ సర్కార్‌ వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో వాగ్ధానాలు చేసిన మోడీ సర్కార్‌ ప్రజల్ని మోసం చేసిందని, ఇన్నేళ్లు దేశానికి చేసిందేమీ లేదని చెప్పటం రచయిత అసలు ఉద్దేశమ‌ని ఇలా తన ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేశాడని ట్విట్టర్‌లో అభిప్రాయాలు వెలువడ్డాయి. స‌ద‌రు గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ప్రధాని మోడీపై ఈ-బుక్‌ను పై విధంగా రూపొందించి మే 23న అమ్మకానికి పెట్టగా, మే 25న తొలగించారు.