స‌ల్మాన్ కేసు వేసింది రివ్యూపై కాద‌ట‌

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్.. క‌మ‌ల్ ఆర్.ఖాన్ అనే క్రిటిక్ మీద ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే జీ5, జీప్ల‌స్ ఓటీటీ ద్వారా విడుద‌లైన‌ త‌న కొత్త చిత్రం గురించి క‌మ‌ల్ ఇచ్చిన వీడియో రివ్యూ చూసి ఆగ్ర‌హించి స‌ల్మాన్ అత‌డికి నోటీసులు ఇచ్చిన‌ట్లుగా మీడియాలో వార్త‌లొచ్చాయి.

ఐతే సినిమాకు స‌మీక్ష ఇవ్వ‌డంలో త‌ప్పేముంది, ఆ మాత్రానికే ప‌రువు న‌ష్టం దావానా అన్న సందేహాలు రావ‌డం స‌హ‌జం. ఆ మాట‌కొస్తే రాధె సినిమా మీద చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాను ఏకిప‌డేశారు. మ‌రి క‌మ‌ల్ ఆర్.ఖాన్ మీద మాత్ర‌మే స‌ల్మాన్ టీం ఇలా దావా వేయ‌డం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం స‌ల్మాన్ స‌న్నిహిత వ‌ర్గాలు మీడియాకు వెల్ల‌డించాయి.

క‌మల్.ఆర్.ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి త‌న స‌మీక్ష‌ల్లో ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేస్తుంటాడు. మొద‌ట్నుంచి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనే అత‌ను సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా స‌మీక్ష‌ల్లోనూ హీరోల‌ను వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డం అత‌డికి అల‌వాటు. రాధె రివ్యూలో కూడా స‌ల్మాన్‌ను ఉద్దేశించి చోర్ అనడం అత‌డి టీం గుర్తించింద‌ట‌. సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఇలా వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డం ప‌ట్ల స‌ల్మాన్ టీంలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది.

గ‌తంలోనూ క‌మ‌ల్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండ‌టంతో ఈసారి అత‌డికి గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌న్న ఉద్దేశంతో ప‌రువు న‌ష్టం దావా వేశార‌ని.. ఈ వ్య‌వ‌హారాన్ని అంత తేలిగ్గా వ‌ద‌లాల‌నుకోవ‌ట్లేద‌ని.. ఇంకోసారి స‌ల్మాన్ గురించే కాక వేరే హీరోల గురించి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డానికి భ‌య‌ప‌డేలా అత‌డికి గుణ‌పాఠం నేర్పాల‌ని డిసైడైన‌ట్లు తెలుస్తోంది.