ప్ర‌భాస్‌కు పోటీగా రాజ‌మౌళి తండ్రి

టాలీవుడ్ వ‌ర‌కు మిడ్ రేంజ్ స్టార్ అయిన ప్ర‌భాస్‌.. ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డిగా మార‌డానికి కార‌ణం బాహుబ‌లి సినిమా. ఈ సినిమాకు క‌థ అందించింది విజ‌యేంద్ర ప్ర‌సాద్. ఆ కోణంలో చూస్తే ప్ర‌భాస్ ఎదుగుద‌ల‌కు విజ‌యేంద్ర కూడా ఒక కార‌ణ‌మే. అయితే ఇప్పుడు ప్ర‌భాస్, విజ‌యేంద్ర మ‌ధ్య ప‌రోక్షంగా బాక్సాఫీస్ వార్ జ‌ర‌గ‌బోతుండ‌టం విశేషం. ప్ర‌భాస్ ఇప్ప‌టికే ఆదిపురుష్ అనే భారీ చిత్రాన్ని మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అది రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా. ఇప్పుడున్న అధునాత‌న టెక్నాల‌జీని వాడుకుని రామాయ‌ణ గాథ‌ను భారీ స్థాయిలో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఓం రౌత్. ఇప్ప‌టికే ఇండియాలో రామాయ‌ణం ఆధారంగా ఎన్నో సినిమాలు రాగా.. ఇది లేటెస్ట్ వెర్షన్.

ఐతే ప్ర‌భాస్ రామాయ‌ణం మీద సినిమా చేస్తున్న స‌మ‌యంలో.. ఈ పురాణ గాథ‌కు మ‌రో వెర్ష‌న్ సిద్ధ‌మ‌వుతోంది. దీనికి క‌థ అందించింది విజ‌యేంద్ర ప్ర‌సాద్ కావ‌డం విశేషం. ఆ సినిమా పేరు.. సీత‌. రామాయ‌ణ గాథ‌ను సీత కోణంలో చెప్పే క‌థ ఇది. విజ‌యేంద్ర త‌న‌దైన శైలిలో ఈ క‌థ‌ను తీర్చిదిద్దారు. అలౌకిక్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో సీత పాత్ర‌ను ఆలియా భ‌ట్ లేదా క‌రీనా క‌పూర్ ఎంపికవుతార‌ని అంటున్నారు. ఆ పాత్ర‌కు ఎవ‌రు ఖ‌రార‌వుతారో కానీ.. ఇందులో రావణుడి పాత్ర‌కు మాత్రం ర‌ణ్వీర్ సింగ్ ఓకే అయ్యాడ‌ట‌. ఆదిపురుష్‌లో రావ‌ణుడి పాత్ర‌ను సైఫ్ అలీఖాన్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మ‌న‌ అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత మ‌ధు మంతెన క‌లిసి రామాయ‌ణ నేప‌థ్యంలో మ‌రో భారీ ప్రాజెక్టును కొన్నేళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు. కానీ అదింకా మొద‌లు కాలేదు. కానీ ఆ సినిమా మీద వ‌ర్క్ అయితే న‌డుస్తున్న‌ట్లు చెబుతున్నారు.