మోడిపై బెంగాల్ దెబ్బ బాగా పడినట్లుందే ?

ప్రధానమంత్రి నరేంద్రమోడిపై ఎన్నికల దెబ్బ బాగా పడినట్లు అనుమానంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తగిలిన దెబ్బ మరీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా అధికారంలోకి వచ్చేయటమే మిగిలింది అన్నట్లుగా మోడి, అమిత్ షా బిల్డప్ ఇచ్చారు. ఎలాగైనా మమతాబెనర్జీని ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో బెంగాల్ ఎన్నికల్లో వీళ్ళద్దరి ఏ స్ధాయిలో పోరాడారో దేశమంతా చూసింది.

అయితే వీళ్ళెంత పోరాడినా ఉపయోగం లేకపోయింది. 213 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించటం ద్వారా జనాలు మూడోసారి మమతకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. సరే ఇదంతా చరిత్ర అనుకుందాం. అయితే తాజాగా జరిగిన డెవలప్మెంట్ ఏమిటంటే మొదటిసారి పీఎం-కిసాన్ పథకం కింద పశ్చిమబెంగాల్ రైతులు నిధులను అందుకోబోతున్నారు. 2019లో పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుండి బెంగాల్ రైతుల్లో ఎవరు కూడా లబ్దిపొంద లేదు.

అంటే మొట్ట మొదటి సారి ఈ పథకం ద్వారా బెంగాల్ రైతులు లబ్దిపొందబోతున్నారన్నమాట. పీఎం-కిసాన్ పథకం ఉద్దేశ్యం ప్రధానంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించటమే. గడచిన మూడేళ్ళుగా ఈ పథకం క్రింద దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులకు నిధులు అందుతున్నాయి కానీ బెంగాల్లో మాత్రం అమలు కావటంలేదు. అలాంటిది మొదటిసారి 7.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నది.

తాజాగా పథకం కింద కేంద్రప్రభుత్వం రు. 20,667 కోట్లను విడుదల చేసింది. పథకంలో లబ్దిపొందాల్సిన రైతుల జాబితాను బెంగాల్ ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్లే ఇంతకాలం బెంగాల్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని కేంద్రం అంటోంది. ఇదే సమయంలో తాము ఇచ్చిన జాబితాను కేంద్రం పట్టించుకోవటం లేదని బెంగాల్ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోంది. వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టేస్తే లక్షలాది మంది రైతులు నష్టపోయారన్నది వాస్తవం. ఈ నేపధ్యంలోనే కారణాలేవైనా బెంగాల్ ఎన్నికలు కాగానే 7 లక్షల మంది రైతులను పథకంలో లబ్దిదారులుగా కేంద్రం చేర్చటం సంతోషించాల్సిన విషయమే.