చంద్ర‌బాబుకు మ‌ళ్లీ దొరికిన జ‌గ‌న్‌.. ఈ సంచ‌ల‌న నిర్ణ‌యమే రీజ‌న్‌..!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక‌వైపు జ‌నాలు క‌రోనాతో హ‌డ‌లి పోతున్న విషయం తెలిసిందే. ఇక‌, ఈ వైర‌స్ త‌మ‌ను ఎక్క‌డ చుట్టుకుంటుందో అనే బెంగ‌తో చాలా మంది ముందుగానే దీని నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు.. అదే సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ‘వ్యాక్సిన్‌తోనే క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌’ అనే మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తిండినీళ్లు కూడా వ‌దిలేసి.. వ్యాక్సిన్ ఎక్క‌డిస్తారు మ‌హ‌ప్ర‌భో అంటూ.. వ్యాక్సిన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

వ్యాక్సిన్ ఇచ్చే వ‌ర‌కు ఎంత సేపైనా ప‌డిగాపులు ప‌డుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు.. ఇలా .. అన్ని వ‌ర్గాలకు చెందిన 45 ఏళ్లు పైబ‌డిన వారు.. ఏపీలో వ్యాక్సిన్ కేంద్రాల‌కు పోటెత్తుతున్నారు. గ‌డిచిన నాలుగు రోజులుగా మృతుల సంఖ్య 100కు చేరువ‌లో ఉండ‌డం (93-96-92-92 ఇలా వ‌రుస‌గా మృతుల సంఖ్య ఉంటోంది)తో మ‌రింత బెంబేలెత్తుతున్నారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకుంటే.. కొంత‌వ‌ర‌కైనా మ‌హమ్మారి నుంచి ర‌క్ష‌ణ ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు.

అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం సోమ‌,మంగ‌ళ‌వారాల్లో వ్యాక్సిన్ ఇవ్వ‌రాద‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పులపై అధికారులు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో 3.5 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉండగా.. రెండో డోసు వారికే టీకా వేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు అధికారులు ప్రయత్నం మొదలుపెట్టారని స‌ర్కారు ప్ర‌క‌టించింది.

అంతేకాదు, ఎవరికి, ఎప్పుడు టీకా ఇస్తారనే వివరాలతో ఇంటి వద్దకే స్లిప్పుల పంపిణీ చేయనున్నారని స‌మాచారం. టోకెన్ల పంపిణీ పూర్తయ్యాకే కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్ర‌క్రియ పూర్త‌యి.. తిరిగి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెండు రోజులు ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. క‌నీసం నాలుగు రోజులు ప‌డుతుంద‌ని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో ఎంత మంది క‌రోనా బారిన ప‌డ‌తారోన‌ని.. ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక‌, ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌బుత్వంపై నిప్పులు చెరుగుతున్న టీడీపీకి తాజాగా సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత‌గా అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే క‌రోనా రోగుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేద‌ని.. వ్యాక్సిన్ కొన‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉదాసీనంగా ఉంద‌ని.. ఇత‌ర రాష్ట్రాల‌కు కోట్ల‌కొద్దీ వ్యాక్సిన్ ఇస్తుంటే.. ఏపీకి మాత్రం కేవ‌లం 13 ల‌క్ష‌లే ఇవ్వ‌డం ఏంట‌ని.. టీడీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, పార్టీ నేత‌ల‌కు కూడా అందివ‌చ్చిన వ‌రంగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వ్యాక్సిన్ నిలుపుద‌ల‌పై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.