కరోనా తగ్గిన రోగులపై ‘బ్లాక్ ఫంగస్’ దాడి

కరోనా వైరస్ వచ్చి తగ్గిన రోగులపై మరో రకమైన దాడి మొదలైంది. కరోనా వైరస్ వచ్చి కోలుకున్న వారిలో మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) సమస్య పెరిగిపోతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా వచ్చి కోలుకున్నా బ్లాక్ ఫంగస్ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స అందిచకపోతే చనిపోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్యునిటి కెపాసిటి తక్కువున్న వారిలోనే ఈ ఫంగస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని కూడా డాక్టర్లు గుర్తించారు.

ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్ళు, ముక్కు చుట్టు ఎర్రబడుతుంది. అలాగే నొప్పులు మొదలవుతాయి. తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, రక్తపు వాంతులు ప్రారంభమైపోతాయి. చివరకు మతిస్ధిమితం కోల్పోవటం, ఊపిరితిత్తుల్లో సమస్య పెరిగి రోగికి సీరియస్ అయిపోతుంది. బ్లాక్ ఫంగస్ ఎవరిలో కనబడుతుందంటే షుగర్ కంట్రోలులో లేనివారిలో, స్టిరాయిడ్స్ వాడకం వల్ల ఇమ్యునిటిపవర్ తగ్గిపోయిన వారిలో, వైద్యంపేరుతో ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్నవారిలో, కరోనా సోకేనాటికే ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిపైనే ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

ఫంగస్ ఎటాక్ అయినవారిలో ఎక్కువగా సైనసైటిస్, ముక్కురంద్రాలు మూసుకోపోతాయట. దవడ ఎముకల్లో నొప్పి మొదలవుతుందట. మొహంలో ఒకవైపు వాపు, నొప్పి, తిమ్మిరి మొదలవుతుందట. ముక్కు నల్లగా మారిపోవటంతో పాటు పంటినొప్పి కూడా మొదలవటం లాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుందట. పై లక్షణాల్లో రోగులు దేన్ని గమనించినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి వైద్యం మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ తగ్గిపోయిన వాళ్ళల్లో పై లక్షణాలతో మళ్ళీ సీరియస్ అయిన వాళ్ళున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కు సకాలంలో వైద్యం ఎంత అవసరమో బ్లాక్ ఫంగస్ కు కూడా వైద్యం అంతే అవసరమంటున్నారు. ఫంగస్ సమస్య పెరిగిపోయిన తర్వాత వైద్యుల దగ్గరకు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. కాబట్టి కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిందని అనుకునేందులేదు.