నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఇంత వివక్షా ?

దేశం యావత్తు కరోనా వైరస్ కష్టకాలంలో ఉండగా సాయం అందించటంలో నరేంద్రమోడి సర్కార్ పక్షపాతబుద్ధి బయటపడిందా ? అవుననే సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి మరి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటికే టీకాలను అందించటంలోను, ఆక్సిజన్ సరఫరా చేయటంలోనే కేంద్రం అనుసరిస్తున్న వివక్ష బయటపడింది. ఎక్కువ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు టీకాలను అందిచని విషయం బయటపడింది.

రోజుకు వేలాది కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు తక్కువ టీకాలను సరఫరా చేసిన కేంద్రం అంతకన్నా తక్కువ కేసులు నమోదవుతున్న గుజరాత్ కు ఎక్కువ టీకాలు సరఫరా చేసిన విషయం బయటపడింది. ఇలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం వివక్ష చూపుతున్న విషయం స్పష్టమైపోయింది. కష్టకాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎక్కువ దృష్టిపెట్టిన నరేంద్రమోడి సర్కార్ నాన్ బీజేపీ రాష్ట్రాలపై మాత్రం తక్కువ చూస్తోందని ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తాజాగా విదేశాల నుండి పెద్దఎత్తున మెడికల్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ పంపిణిలో కూడా వివక్ష చూపుతోందనే గోల పెరిగిపోతోంది. ఇందుకు కారణం ఏమిటంటే ఆస్ట్రేలియా నుండి 1056 వెంటిలేటర్లు, బిపాప్-సిపాప్ యంత్రాలు, 43 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. అమెరికా నుండి 43 వేల ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు, 1.56 లక్షల రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు, పీపీఈ కిట్లు, బహ్రెయిన్ నుండి 2 ధ్రవీకృత ఆక్సిజన్ కంపెయినర్లు వచ్చాయి.

విదేశాల నుండి వచ్చిన మెడికల్ ఎక్విప్మెంట్ ను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్రం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత సాయాన్ని పంపిణీ చేశారో చెప్పమంటే మాత్రం చెప్పటంలేదు. ఇదే విషయాన్ని మీడియా ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం సమాధానం చెప్పటంలేదు. దీంతో బీజేపీ పాలితరాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ సాయం అందించిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సాయం అందించటంలో పాదర్శకత పాటించని కారణంగానే కేంద్రం సమాధానాలు చెప్పటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.