త‌ప్పు మ‌న ద‌గ్గ‌ర పెట్టుకుని ఎదురు దాడెందుకు మంత్రివ‌ర్యా.. నెటిజ‌న్ల టాక్!

క‌రోనా భూతం రాష్ట్రాన్ని భ‌య‌పెడుతున్న ప‌రిస్థితిని ఎవ‌రూ తోసిపుచ్చ‌లేరు. అధికార‌పార్టీ వైసీపీలోనూ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ల వ‌రకు.. రాష్ట్రంలో ప‌రిస్థితిని కాద‌న‌లేక పోతున్నారు. ఇక‌, ఈ ప‌రిస్థితిని దాచిపెట్టి.. ప్ర‌జ‌ల‌కు అంతా మేలే జ‌రుగుతోంద‌న్న విధంగా ప్ర‌బుత్వం చెబుతోంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోందో.. ప్ర‌జ‌లు ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారో.. ప్ర‌ధాన మీడియా ప్ర‌సారం చేస్తోంది. ఇక‌, ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు.. ప్ర‌శ్నించ‌కుండా ఉంటాయా? అలా ఉంటే.. ప్ర‌తిప‌క్షాలు అని ఆయా పార్టీల‌ను ఎవ‌రైనా అంటారా?

ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసేందుకు, ప్ర‌శ్నించేందుకే క‌దా.. ప్ర‌తిప‌క్షాలు ఉన్న‌ది! అయితే.. ఈ చిన్న మౌలిక సూత్రాన్ని సైతం అధికార పార్టీ వైసీపీ మ‌రిచిపోయిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. తాజాగా మంత్రి పేర్నినాని.. టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా చంద్ర‌బాబు సెంట్రిక్ గా మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శక్తులను ఒడ్డి కరోనాకు ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం కరోనా సమయంలోనూ రాజకీయాలను చేస్తున్నాడు. మన రాష్ట్రం పరువును చంద్రబాబు బయట రాష్ట్రాల ముందు తీస్తున్నారు. అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ఎందుకీ కక్ష.? కొడుకు భవిష్యత్తు కోసం ఇంత దిగజారాలా? ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి రొచ్చు రాజకీయాలు చేస్తున్నారు. బెడ్స్ కాళీ ఉండటం ముఖ్యమా..? కాళీ బెడ్స్ పేషంట్ లకు ఇవ్వడం ముఖ్యమా? నువ్వు దిగిపోయెప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఏమిటి? కనీసం ఒక్క వైరాలజీ లాబ్ పెట్టావా? ఆక్సీజన్ కోసం కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించావా? అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. సింగపూర్ నుంచి కూడా ఆక్సీజన్ తెప్పిస్తున్నామని, అన్ని రాష్ట్రాలు చిన్న వాడైనా జగన్ ని ప్రశంసిస్తుంటే నువ్వు విషం కక్కుతున్నావ్ చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు.

ఇప్పటి వరకు అన్ని విడుతలు కలిపి 67 లక్షల మందికి వాక్సిన్ వేశామని అన్నారు. అయితే.. నిజానికి కోవిడ్ బాధితుల‌కు భారీ ఎత్తున ప్ర‌బుత్వం నుంచి సేవ‌లు అందుతుంటే.. ఎవ‌రూ విమ‌ర్శించ‌రు. కానీ, తాజాగా రాష్ట్ర హైకోర్టు కూడా ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టింది? ఎందుకు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా చేయ‌డం లేద‌ని కూడా ప్ర‌శ్నించింది. అంటే.. ప్ర‌భుత్వం వైపు త‌ప్పు ఉన్న‌ట్టేగా! ఈ విష‌యాన్ని దాచిపెట్టి.. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తిదాడులు చేయ‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అంటున్నారు ప‌రిశీల‌కులు.