పాపం..రత్నప్రభ

ఆమొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆమె సర్వీసులో ఎక్కువ భాగం కర్నాటకలో జరిగిపోయింది. ఏదో కొంత కాలం ఏపిలో డిప్యుటేషన్ మీద పనిచేశారు. అంటే ఐఏఎస్ అధికారిణిగా రత్నప్రభ మన జనాలకు తెలిసింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ఆమెను బీజేపీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో తమ అభ్యర్ధిగా పోటీలోకి దింపింది.

అభ్యర్ధిగా రత్నప్రభ పేరు ఖరారయ్యే సమయానికి పార్టీలోని నేతల్లో చాలామందికి ఆమెవరో కూడా తెలీదు. అలాంటి రత్నప్రభ అభ్యర్ధిత్వాన్ని ముందే ఖరారు చేసి ప్రచారంలోకి దించాల్సింది. అలాంటిది నామినేషన్లు ఇక రెండు రోజుల్లో ముగుస్తుందనగా మాత్రమే ఆమె పేరును ఖరారు చేసింది అధిష్టానం. చివరి నిముషంలో అభ్యర్ధిత్వం ఖరారైన కారణంగా చాలామంది నేతలకు ఆమె పరిచయం కూడా కాలేదు.

అసలే రాజకీయాలకు కొత్త. దానికితోడు పార్టీలోనే చాలామంది నేతలకు పరిచయంలేదు. అలాంటిది ఇక ఆమెకు ప్రచారం చేసేదెవరు ? ఆమెకోసం పనిచేసేదెవరు ? ఇదే విషయం పోలింగ్ రోజున స్పష్టంగా బయటపడిపోయింది. ఎలాగంటే పోలింగ్ మొదలైన కాద్దిసేపటికే ఉన్నకొద్ది ఏజెంట్లు కూడా బయటకు వెళ్ళిపోయారట. అసలు ఏజెంట్లే దొరకని బీజేపీకి దొరికిన కొద్దిమంది ఏజెంట్లు కూడా పోలింగ్ అయిపోగానే వెళ్ళిపోయారంటే ఏమిటర్ధం ?

ఇలాంటి నేపధ్యం ఉన్న పార్టీ అభ్యర్ధిగా ఉపఎన్నికలో గెలుస్తానని రత్నప్రభ ఎలా అనుకున్నారో అర్ధం కావటంలేదు. ప్రచారంలో నేతలు కూడా పెద్దగా పాల్గొనలేదు. ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో రత్నప్రభకు ప్రచారం చేసేంత మంది నేతలు కూడా పార్టీలో లేరు. మరి తానే పోటీ చేయటానికి ఉత్సాహం చూపారో లేకపోతే బీజేపీ అగ్రనేతలే ఆమెను రంగంలోకి దింపారో తెలీదు. చివరకు ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే ఇపుడందరు రత్నప్రభను చూసి పాపం…రత్నప్రభ అనుకుంటున్నారు.