ఏపీ మరో మహారాష్ట్రగా మారనుంది.. అలెర్టు అవ్వండి జగన్

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించారు. భారీ మెజార్టీతో ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎక్కువ ఓట్లను ఆయన సాధించారు. ఈ క్రెడిట్ మొత్తం పార్టీ అధినేత.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే వేయాలి. ఈ ఆనంద సమయంలో మరో చేదు వార్త సాయంత్రానికి వెలువడింది. ఏపీలో కరోనా కేసులు కొంతకాలంగా భారీ ఎత్తున నమోదవుతున్నాయి. గత రికార్డుల్ని బద్ధలు కొట్టేలా ఒక్కరోజులో ఏపీలో నమోదైన కేసులు అక్షరాల 24వేల కేసులు కావటం గమనార్హం.

చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మరో మహారాష్ట్రగా మారుతోందని చెప్పక తప్పదు. ఇలాంటివేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఏపీలోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో సాధారణ బెడ్లు కూడా లభించని దుస్థితి. వైద్యం కోసం వచ్చిన వారు.. వైద్యుడి వద్దకు వెళ్లటానికి ముందే.. ప్రాణాలు వదులుతున్న వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

అంతేకాదు.. సామాన్యులే కాదు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం కరోనా కాటుకు బలైపోతున్న వారిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే.. ఏపీలో అర్జెంట్ గా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేసుల తీవ్రతను వెంటనే కంట్రోల్ చేయకుంటే.. మరో మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు వారం నుంచి రెండు వారాల వరకూ పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తే తప్పించి ఏపీలో పరిస్థితులు సర్దుకోవని చెబుతున్నారు. ఇందుకు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి.. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకునే వీలుంది. మరి.. జగన్ ఏం చేస్తారో చూడాలి.