పీకే పాత ట్వీట్ వైరల్

ఆదివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అలాగే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలూ వెల్లడయ్యాయి. ఐతే దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చనీయాంశమైంది, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే తమిళనాట, కేరళలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే ఒక అంచనా వచ్చేసింది. అస్సాం, పుదుచ్చేరి చిన్న రాష్ట్రాలు కాబట్టి అంత ఆసక్తి లేదు.

ఏడాది కిందట్నుంచే దేశం దృష్టిని ఆకర్షిస్తూ.. దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తాయన్న అంచనాలు రేకెత్తించి.. ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగిన బెంగాల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నిలిచింది. చివరికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అసాధారణ విజయాన్నందుకోవడం.. బీజేపీ నేతృత్వంలోని కూటమి కనీసం వంద మార్కును కూడా టచ్ చేయలేక డబుల్ డిజిట్ సీట్లకే పరిమితం కావడం అనూహ్యం.

మమత పార్టీ గెలిచినా బొటాబొటీ మెజారిటీతో సరిపెట్టుకోక తప్పదనే అనుకున్నారంతా. కానీ ఈ స్థాయి మెజారిటీ రావడం, బీజేపీ ఇలా చతికిలబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. డిసెంబరు 21న ప్రశాంత్ వేసిన ట్వీట్లో.. బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ మార్కును దాటబోదని పీకే జోస్యం చెప్పాడు. ఏదో ఒక మాట అనేసి ఊరుకోకుండా ఈ ట్వీట్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలని, బీజేపీ తన అంచనాలను మించితే తాను ట్విట్టర్ వదిలేసి వెళ్లిపోతానని పీకే అన్నాడు.

ఏప్రిల్ 10వ తేదీని పీకే మరోసారి ఇదే మాటను నొక్కి వక్కాణించాడు. ‘‘ఇంతకుముందు చెప్పా, ఇప్పుడూ చెబుతున్నా.. బెంగాల్‌లో బీజేపీ 100 సీట్ల మార్కును టచ్ చేయదు. పీరియడ్’’ అని తేల్చి చెప్పాడు పీకే. ఇప్పుడు అతనన్నట్లే బీజేపీ డబుల్ డిజిట్ సీట్లకు పరిమితం కావడంతో పీకే మొనగాడే అంటూ అతణ్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీఎంసీకి ఇంతటి భారీ విజయం కట్టబెట్టిన పీకే.. తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోనంటూ సంచలన ప్రకటన చేయడం విశేషం.