బీజేపీకి డిపాజిట్ కూడా గల్లంతేనా ?

రెండు చోట్లా బీజేపీ పరిస్దితి ఏమిటో అర్ధమైపోయింది. తెలంగాణాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక, తిరుపతి లోక్ సభ ఉపఎన్నిలో పోటీచేసిన బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. రెండు చోట్లా విజయం తమదే అంటు ప్రచారంలో నానా గోలచేశారు. తెలంగాణాలో ఏమో కేసీయార్ కత చెప్పేస్తామంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎంతెంత గోలచేశారో.

అలాగే తిరుపతి ఎన్నిక విషయంపై మాట్లాడుతు భగవద్గీత పార్టీ కావాలా ? బైబిల్ పార్టీ కావాలా ? అంటు జనాలను రెచ్చగొట్టేందుకు చాలానే ప్రయత్నించారు. అయితే కడపటి వార్తలు అందే సమయానికి సాగర్ అసెంబ్లీలో ఏమో 6800 ఓట్లు వచ్చాయి. అలాగే తిరుపతి ఉపఎన్నికలో 35 వేల ఓట్లొచ్చాయి. సాగర్ ఉపఎన్నికలో వచ్చిన ఓట్లేమో అచ్చంగా కలమంపార్టీ ఓట్లనే అనుకోవాలి. అయితే తిరుపతి ఉపఎన్నికలో వచ్చిన 35 వేల చిల్లర ఓట్లలో బీజేపీ షేర్ ఎంత ? జనసేన ఓట్లెన్ని అనేది తేలాలి.

మొత్తంమీద చూడాల్సిందేమంటే రెండోచోట్లా బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. తిరుపతిలో అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అనేకమంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉత్తరాధి నేతలు చాలామందే హాజరయ్యారు. ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. అసలు వైసీపీ, టీడీపీలు తమకు పోటీనే కాదన్నట్లుగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు నానా గోలచేశారు.

అయితే వాళ్ళ మాటలంతా కేవలం మీడియా సమావేశాల్లో హడావుడి చేయటానికి మాత్రమే పనికొస్తుందని అందరు అనుకుంటున్నదే. నిజానికి బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఎవరో పార్టీలో నేతల్లోనే చాలామందికి తెలీదంటే ఆశ్చర్యంలేదు. పార్టీ నేతల్లోనే చాలామందికి తెలీని రత్నప్రభకు జనాలు ఓట్లేస్తారని ఎలా అనుకున్నారో అర్ధమే కావటంలేదు. పార్టీ సీనియర్ నేతల్లో ఎవరో ఒకరిని నిలబెట్టినా ఇంతకన్నా ఎక్కువ ఓట్లే వచ్చేదనటంలో సందేహంలేదు. మొత్తం మీద తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకున్న బీజేపీ నేతలకు వాస్తవం ఏమిటో జనాలు తమ ఓట్లు ద్వారా స్పష్టంచేశారు.