బాబు.. సీనియ‌ర్టీ టీడీపీకి ప‌నిచేయ‌డం లేదా ?


టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు తాను నోరు విప్పితే.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటారు. అంతేకాదు.. త‌న‌క‌న్నా సీనియ‌ర్ నేత ఈ దేశంలో ఎవ‌రూ లేర‌ని కూడా చెబుతారు. మ‌రి ఆయ‌న సీనియార్టీ పార్టీ కోసం ఏమేర‌కు ఉపయోగ ప‌డుతోంది? ఏమేర‌కు పార్టీని న‌డిపించేందుకు చంద్ర‌బాబు వ్యూహాలు ప‌నిచేస్తున్నాయి? అంటే.. ఏమీ లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా బాబు వ్యూహాలు ఏదీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. తాజాగా కూడా ఆయ‌న వ్యూహ లేమి స్ప‌ష్టంగా క‌నిపించింది.

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోలింగ్ రోజు.. అధికార పార్టీ నేత‌లు దొంగ ఓట్ల దందా కు తెర‌దీశార‌ని.. ఎక్క‌డెక్క‌డి నుంచో వేలాది మంది ఓట‌ర్ల‌ను త‌ల‌రించి.. దొంగ ఓట్లు వేయించార‌ని పెద్ద ఎత్తున చంద్ర‌బాబు ఆరోపించారు. దీనికి సంబంధించిన ప‌లు వీడియో ఆధారాల‌ను కూడా ఆయ‌న చూపించారు. వైసీపీ స‌ర్కారుపైనా.. వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌పైనా తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఇక‌, పార్టీ అభ్య‌ర్థి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మితో ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని.. లేదా ఫ‌లితం ప్ర‌క‌టించ‌కుండా నిలుపుదల చేయాల‌ని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ వేయించారు.

దీంతో హైకోర్టుకు వెళ్ల‌డాన్ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకున్నారు. ఇదంతా కూడా త‌మ అధినేత ముందు చూపుతో చేసిందేన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున‌.. దీనికి క‌వ‌రేజ్ కూడా ఇచ్చింది. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు రెండు రోజుల ముందు ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది అయితే.. విచార‌ణ‌కు సేక‌రించిన రెండు నిముషాల‌లోనే టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇది నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించే కేసు కాద‌ని.. ‘ఎన్నిక‌ల పిటిష‌న్‌’ వేయాల‌ని.. ఇప్ప‌టికే స‌మ‌యం మించిపోయింద‌ని.. పేర్కొంది. దీంతో క‌నీసం ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలియ‌దా ? అంటున్నారు నెటిజ‌న్లు.

ఇన్నేళ్లు రాజ‌కీయాల్లో ఉన్న చంద్ర‌బాబుకు ఎన్నిక‌ల పిటిష‌న్‌కు సాధార‌ణ పిటిష‌న్‌కు తేడా తెలియ‌క‌పోతే ఎలా? అనే కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి నిజ‌మే క‌దా? అదే.. ఇప్ప‌టికే ఎన్నిక‌ల పిటిష‌న్ దాఖ‌లు చేసి ఉంటే.. ప‌రిస్థితి ఎలా ఉండేదో అని పార్టీ సీనియ‌ర్లు కూడా అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు స‌మ‌యం మించిపోయింద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఇలాంటి ప‌రిణామాలు వ‌చ్చిన‌ప్పుడు బాబు త‌న సీనియార్టీని వినియోగించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.