బెంగాల్లో విచిత్ర పరిస్ధితి

ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరిగినా యావత్ దేశం దృష్టిమాత్రం పశ్చిమబెంగాల్ పైనే ఉంది. హై ఓల్టేజీ పవర్ తో జరిగిన హోరా హోరీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. బెంగాల్లో మమతాబెనర్జీ-నరేంద్రమోడి మధ్య ప్రచారం హోరాహారీగా జరిగింది. కౌంటింగ్ మొదలైన తర్వాత వెలువడిన మెజారిటిలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటంటే బీజేపీ మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటితో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మమత మాత్రం వెనకబడ్డారు.

బెంగాల్లో ఎన్నికలు ఒకఎత్తు మమత పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకెత్తు అన్నట్లుగా సాగింది ఎన్నికలు. ఎందుకంటే మమతను ఎలాగైనా ఓడించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వయం చాలా ప్లాన్లే వేసింది. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు అధికారిని బీజేపీలోకి లాగేసుకున్నారు. సుబేందు సంవత్సరాల తరబడి నందిగ్రామ్ నుండి గెలుస్తునే ఉన్నారు.

అంటే నందిగ్రామ్ ప్రాంతంలో సుబేందు అధికారి కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి. ఇలాంటి నియోజకవర్గంలో తనపై పోటీచేసి గెలవాలని సుబేందు చాలెంజ్ చేయగానే మమత రెడీ అనేశారు. ఎన్నో ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్న భరత్ పూర్ ను కాదని మమత నందిగ్రామ్ లో పోటీచేశారు. దాంతో ఈ నియోజకవర్గం ప్రచారంలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి.

ఎలాగైనా మమతను ఓడించాలని మోడి+అమిత్+సుబేందు సర్వశక్తులు ఒడ్డారు. కౌంటింగ్ మొదలైన తర్వాత రెండు రౌండ్లలో మమత 4500 ఓట్లతో వెనకబడుంది. తాను పోటీచేస్తే పరిస్ధితి ఏమిటనే విషయాన్ని మమత సర్వే చేయించుకోకుండానే దూకారా అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. విచిత్రమేమిటంటే రాష్ట్రంలో మెజారిటి సీట్లలో టీఎంసీ లీడ్లలో ఉంటే వ్యక్తిగతంగా మమత మాత్రం వెనకబడుంటం. అయ్యింది ఇప్పటికి రెండు రౌండ్లే. జరగాల్సిన రౌండ్లు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇపుడే ఏమీ చెప్పలేని స్ధితి. అందుకనే నందిగ్రామ్ పై సర్వత్రా ఆసక్తి పెరిగిపోతోంది.