ఆ ఎమ్మెల్యే ‘సొంత‌’ ప్ర‌చారంపై జ‌గ‌న్ ఆరా ?

రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు అనుస‌రిస్తున్న విధానం.. సీఎం జ‌గ‌న్‌కు చికాకు క‌లిగిస్తోంద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. కొంద‌రు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ అభిమ‌తానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా చెబుతున్నారు. అయితే.. వీరిలో అంద‌రూ కూడా జ‌గ‌న్‌కు కావాల్సిన వారు, ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డంతో జ‌గ‌న్ అడుగులు ముందుకు వేసి .. ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేక పోతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే వారిని చిరున‌వ్వుతో హెచ్చరిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రిగింది? విష‌యం ఏంటి ? అని ఆరా తీస్తే.. ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం వెలుగు చూసింది.

రాష్ట్రంలో రెండు కీల‌క ప్రాంతీయ పార్టీల్లో భిన్న‌మైన వైఖ‌రి ఉంది. టీడీపీని తీసుకుంటే.. ఎవ‌రు ఎలా అయినా.. ఏదైనా చేసుకోవ‌చ్చు.. కానీ, పార్టీకి వ‌ర్తించేలా చేసుకోవాలి. ఏం చేసినా.. పార్టీ జెండా క‌ట్టి చేసుకుంటే చాలు. గ‌తంలో ఇలానే చంద్ర‌బాబు ఆదేశించారు. దీంతో చాలా మంది పార్టీ జెండా పెట్ట‌డం ఇష్టం లేకో.. లేక‌.. మ‌రే కార‌ణమో తెలియ‌దు కానీ.. చేయాల‌ని అనుకున్న ప‌నులను కూడా వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ దెబ్బ‌తింది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం సీన్ రివ‌ర్స్ అయిపోయిం ది. “మీరు ఏదైనా చేసుకోండి. కానీ, పేరు మాత్రం జ‌గ‌న్‌కు రావాలి!” అనే కాన్సెప్ట్ ఈ పార్టీలో సాగుతోంది. దీంతో నేత‌లు ఏం చేసినా.. అంతిమంగా పేరు మాత్రం జ‌గ‌న్‌కు ఇచ్చే ప‌నులే చేస్తున్నారు.

అయితే.. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌లు స్వ‌యంగా కొన్ని ప‌నులు చేస్తున్నారు. క‌రోనా స‌మయంలో నెల రోజుల పాటు.. చెవిరెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌ల‌కు అన్నం పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామాల‌కు శానిటైజ‌ర్లు, మాస్కులు కొని పంపించారు. కానీ, ఎక్క‌డా జ‌గ‌న్ పేరు వాడ‌లేదు. ఇక‌, రాప్తాడులోనూ.. తోపుదుర్తి ప్ర‌కాశ్‌.. ఇలాంటి సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. ఎక్క‌డా ఆయ‌న‌కూడా జ‌గ‌న్ ఫొటోలు పెట్టుకోకుండానే చేస్తున్నారు. కార్య‌క్ర‌మాలు మంచివే అయినా.. ప్ర‌జ‌లకు మేలు చేసేవే అయినా.. త‌న పేరు లేకుండా.. త‌న ఫొటో లేకుండా చేయ‌డంపై జ‌గ‌న్‌కు అవే నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అసంతృప్త నేత‌లు ఫిర్యాదు చేశారు.

దీంతో జ‌గ‌న్ .. ఒకింత సీరియ‌స్ అయినా.. పైకి క‌నిపించ‌కుండా.. న‌వ్వుతూనే హెచ్చ‌రించార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఇలా చేయ‌డం ద్వారా.. అంటే.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు సొంత సొమ్ము ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పుకోవ‌డం ద్వారా.. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. చేసే మంచిలోనూ కొంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వారి సుతిమెత్త‌గా హెచ్చ‌రించేలా ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి వీరి వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశం అయింది.