48 గంటల్లో తెలంగాణ‌లో లాక్‌డౌన్‌?: నివేదిక‌లు సిద్ధం

రోజుకు వేల‌ సంఖ్య‌లో పోజిటివ్ కేసులు.. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు.. క‌రోనా సెకండ్ వేవ్‌తో తెలంగాణ అల్లాడిపోతోంది. ఒక‌వై పు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నా.. ప‌రిస్థితిలో మార్పు క‌నిపించ‌డం లేదు. మాస్కులు ధ‌రించినా.. భౌతిక దూరాన్ని విస్మ‌రిస్తు న్నారు. కొంద‌రు మాస్కులు కూడా పెట్టుకోకుండా సంచ‌రిస్తున్నారు. ఇక‌, ఆసుప‌త్రుల్లో బెడ్లు, ఆక్సిజ‌న్ల కొర‌త ఇంకా వెంటాడుతూనే ఉంది. అంటే. మొత్తంగా అప్ర‌క‌టిత‌.. క‌రోనా క‌బంద హ‌స్తాల్లో తెలంగాణ పౌరులు చిక్కుకున్నారు. ఈ స‌మ‌యంంలో ఏం చేయాలి? చేజారి పోయే వ‌ర‌కు చూస్తూ కూర్చోవాలా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. మేధావుల నుంచి ప్ర‌భుత్వం వ‌ర‌కు తొలిచేస్తోంది.

రెండు రోజుల్లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్త.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించ‌డం.. దీనికి హోం సెక్రటరీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు కమిషనర్లు హాజ‌రు కావ‌డం.. వైద్య నిపుణులు కూడా భాగ‌స్వామ్యం కావడంతో ఏదో జ‌రుగుతోంది! అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే కేంద్రం కూడా 15శాతం పాజిటివ్ కేసులు న‌మోదైన జిల్లాల్లో లాక్‌డౌన్ విధించాల‌ని ఆదేశించింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ నెల 30 తరువాత లాక్‌డౌన్ పెట్టె యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నివేదిక‌లు వ‌చ్చేశాయ్‌!
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. రోజుకు వ‌స్తున్న కేసులు, వాటి తీవ్ర‌త‌, ఎలా క‌ట్టుదిట్టం చేయాలి? ఎలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కానుంది? ఏం చేస్తే.. బెట‌ర్! వంటి అనేక కీల‌క అంశాల‌ను ఈ నివేదిక‌లో స్ప‌ష్టం చేశారు. ఇక‌, లాక్‌డౌన్‌పై హోమ్ శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం. ఈ ప‌రిణామాల‌తో తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. లాక్‌డౌన్‌పైనే చ‌ర్చించుకుంటున్నారు. లాక్‌డౌన్ ఖాయ‌మ‌ని కొంద‌రు.. గ‌ట్టిగానే చెబుతున్నారు. ఇంకొంద‌రు లాక్‌డౌన్‌తోనే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు ఛాన్స్ ఎక్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం!?
గ‌త ఏడాది పెట్టిన నాలుగు నెల‌ల లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏర్ప‌డిన ఆర్థిక క‌ష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కాస్త గాడిలో పడింది. మరోసారి లాక్‌డౌన్ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయేనని సామాన్యులు భయపడుతున్నారు. ఇప్పుడు వలసకార్మి్కుల స్థితి అగమ్యగోచరంగా ఉంది. హైదరాబాద్‌ శివారుల్లో పారిశ్రామిక కంపెనీలో పనిచేస్తున్న బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న‌, కుటీర ప‌రిశ్ర‌మ‌లు, చేతి వృత్తుల వారు, హాక‌ర్లు.. ఆక‌లితో అల‌మ‌టించారు. ఇలా ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి త‌లెత్తితే.. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూల‌డం ఖాయం. అయితే.. జ‌నాలు ముఖ్యం.. జ‌నాలు ఉంటే.. ఆదాయం అదే వ‌స్తుంది! అనే క‌నుక భావిస్తే.. ఖ‌చ్చితంగా లాక్‌డౌన్ విధించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.