డ్రాగన్ ఎంత పనిచేస్తోందో తెలుసా ?

అవసరంలో ఆదుకుంటామని ఒకవైపు ప్రకటనలు ఇస్తోంది. అయితే చేతల్లో మాత్రం భారత్ ను దెబ్బకొట్టాలనే ఆలోచనతోనే పావులు కదుపుతోంది. అంటే ప్రపంచదేశాల దృష్టిలో తాను మంచిదేశమని అనిపించుకోవాలన్న తపనే కనబడుతోంది. కానీ చేతల్లోకి వచ్చేసరికి మనదేశాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అంతా చేస్తోంది. తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా మనదేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఎంతలా పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 3.5 లక్షల కేసులు నమోదవ్వగా 2875 మంది మరణించారు. మరణాల్లో అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవటమే ప్రధాన కారణమవుతోంది. ఈ కారణంపైనే చైనా పాలకులు భారతదేశం అవసరాలకు తగ్గట్లుగా ఆక్సిజన్ సరఫరా చేస్తామని బ్రహ్మాండమైన ప్రకటనలు ఇచ్చారు. ఆక్సిజన్ పరికరాలను కూడా సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

ఒకవైపు సాయం ప్రకటనలు చేసిన ప్రభుత్వం మరోవైపు ఛైనా-భారత్ మధ్య 15 రోజులపాటు కార్గో విమానసర్వీసులను రద్దుచేసింది. దీని కారణంగా చైనా నుండి మనదేశానికి రావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మందులు, ఇతర వైద్యపరికరాల సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలను 40 శాతం పెంచేసింది.

అలాగే మందులు, ఇతర వైద్యపరికరాలకు సంబంధించిన ముడిసరుకు ధరలను కూడా 20 శాతం పెంచేసింది. చైనా విమాన సర్వీసులను నిలిపేసిన కారణంగా భారత్ కు రావాల్సిన విమానాలన్నీ సింగపూర్ లాంటి దేశాల మీదగానే రావాల్సుంటుంది. దీనివల్ల ఎక్కువ టైం పట్టడమే కాకుండా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కాలంలో మనదేశంలో పరిస్ధితులు తెలిసి కూడా కావాలనే చైనా ఎంత ఇబ్బందులు పెట్టాలో అంతా పెడుతోంది. దీంతో డ్రాగన్ అసలు రూపం ఏమిటో మరోసారి ప్రపంచదేశాలకు తెలిసిపోయింది.