బాలీవుడ్ నటుడి హఠాన్మరణం

గత ఏడాది కాలంలో భారతీయ సినీ పరిశ్రమ ఎంతో మంది మంచి నటీనటులను, టెక్నీషియన్లను కోల్పోయింది. కరోనా వల్ల కొందరు.. వేరే అనారోగ్య కారణాల వల్ల మరికొందరు.. మొత్తంగా గత ఏడాది కాలంలో మునుపెన్నడూ లేనంతగా సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మరో మంచి నటుడిని కోల్పోయింది. ఆ నటుడి పేరు.. అమిత్ మిస్త్రీ.

గురువారం మిస్త్రీకి తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. అది అతడి ప్రాణాలనే కబళించింది. ముంబయిలోని అంధేరిలో తన ఇంట్లో ఉండగా.. గుండెపోటుతో కుప్పకూలిపోయిన మిస్త్రీ.. కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు వదిలాడని.. అతణ్ని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని తెలిసింది. మంచి నటుడైన మిస్త్రీ చిన్న వయసులో ఇలా హఠాత్తుగా చనిపోవడం హిందీ ప్రేక్షకులను కలచి వేస్తోంది.

గత ఏడాది అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందన రాబట్టుకున్న ‘బాండిష్ బండిట్స్’ చూసిన వాళ్లు ఎవరూ అమిత్ మిస్త్రీని మరిచిపోలేరు. అందులో దేవేంద్ర రాథోడ్ అనే పాత్రలో అమిత్ మెరిశాడు. సంగీత ప్రధానంగా సాగే ఈ సిరీస్‌లో మిస్త్రీ పాత్ర, అతడి నటన ఆద్యంతం ఆకట్టుకుంటాయి. థియేటర్ ఫీల్డ్ నుంచి నుంచి వచ్చిన మిస్త్రీ.. ముందు టెలివిజన్లో సత్తా చాటుకున్నాడు. తెనాలి రామ టీవీ సిరీస్ అతడికి చాలా మంచి పేరు తెచ్చింది. ఇది కాక దాదాపు పది టీవీ సిరీస్‌ల్లో అతను నటించాడు. తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించాడు.

తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’తో అతడికి మంచి పేరు వచ్చింది. తర్వాత ‘యామ్లా పాగ్లా దీవానా’; ‘గలి గలి చోర్ హై’, ‘బే యార్’, ‘ఎ జెంటిల్‌మ్యాన్’ లాంటి సినిమాల్లో నటించాడు. అతను నటించిన ‘భూత్ పోలీస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పటిదాకా చేసిన సినిమాల కంటే కూడా ‘బాండిష్ బండిట్స్‌’యే మిస్త్రీకి ఎక్కువ పేరు తెచ్చింది.