ఏపీ స‌ర్కారుకు ముప్పు.. అంద‌రినోటా.. ఇదే మాట…‌!

ఏపీ స‌ర్కారు అనిశ్చితిలో ప‌డింద‌నే వాద‌న వ‌స్తోంది. ఆర్థికంగా ఒక‌వైపు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ భారీగా త‌గిలింద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ‌స్తే.. ప్ర‌భుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిప‌దిక‌న‌.. రంగంలోకి దిగి ప్ర‌జ‌లకు సేవ చేసింది. అయితే.. ఇప్పుడు క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి భారీ ఎత్తున కొన‌సాగుతోంది. దీంతో.. ప్ర‌భుత్వం ఇరుకున‌పడుతోంది. ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపించింది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా క‌రోనా భారిన ప‌డి.. మృతి చెందుతున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి.

ఒకే రోజు న‌లుగురు స‌చివాల‌య అధికారులు మృతి చెంద‌డం.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందిగా మారింది. దీంతో స‌చివాల‌యాన్ని మూసివేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు భ‌రోసా కావాల‌ని.. ఉద్యోగులు రోడ్డెక్కారు. త‌మ‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, న‌లుగురు మృతి చెంద‌డంతో ఉద్యోగులు హ‌డ‌లి పోతున్నారు. అంతేకాదు.. విధుల‌కు రాలేమ‌ని ఖ‌రాకండీగా చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారుకు సంక‌ట స్థితి ఏర్ప‌డింది. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. ప్ర‌భుత్వ యంత్రాంగం కూడా కుప్ప‌కూలుతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీలకులు.

తాజాగా సీఎం జ‌గ‌న్‌.. చేసిన స‌మీక్ష‌లో ఇదే విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అయితే.. ఇంటి నుంచి ప‌నిచేసుకునే వెసులుబాటు ఇవ్వాల‌ని కొంద‌రు ఉన్న‌తాధికారులు కోరినా.. సీఎం జ‌గ‌న్ దీనిని లైట్ తీసుకున్న‌ట్టు ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. దీంతో కొంద‌రు అన‌ధికార సెల‌వులు పెడుతున్నారు. మ‌రికొంద‌రు హైద‌రాబాద్‌లో ఇళ్ల నుంచి క‌నీసం బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో ఉన్న‌వారిపైనే ఎక్కువగా భారం ప‌డుతోంద‌నే వాద‌న వ‌స్తోంది. ఫ‌లితంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పైనా ఇది ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే.. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా జ‌గ‌న్ స‌ర్కారుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.