ఈ ఈక్వేష‌న్‌.. జ‌గ‌న్‌కు బెడిసి కొడుతోందా ?


రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్లు.. కలిసి వ‌స్తాయ‌ని నాయ‌కులు భావిస్తుంటారు. అవి పొలిటికల్ కావొచ్చు లేదా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. ఏవైనా.. అంతిమ ల‌క్ష్యంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న కొన్ని ఈక్వేష‌న్లు.. బెడిసి కొడుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. రాష్ట్రంలో ఇటీవ‌ల కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ క్ర‌మంలో 50 శాతం కార్పొరేష‌న్ల‌ను రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి ఇచ్చారు. మిగిలిన వాటిలో కొన్ని మ‌హిళ‌ల‌కు, కొన్ని పురుషుల ప్రాతిప‌దిక‌న జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు.

ఇలాంటి వాటిపై జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి చెందిన క‌మ్మ‌, రెడ్డి, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో త‌మ‌కు ఖ‌చ్చితంగా ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని ఆశించారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు నుంచి పార్టీని బ‌లోపేతం చేయ‌డం, ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం వంటివాటిని చేప‌ట్టారు. అయితే.. తీరా ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. జ‌నర‌ల్‌కు కేటాయించిన స్థానాల‌ను, ప‌ద‌వుల‌ను కూడా బీసీ సామాజిక వ‌ర్గాల‌కు, మైనార్టీల‌కు ఎక్కువుగా కేటాయించారు. ఈ ప‌రిణామం.. క‌మ్మ‌, రెడ్డి, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక‌వ ర్గాల‌కు చెందిన వైసీపీ నేత‌ల‌ను హ‌ర్ట్ చేసింది.

అదే స‌మ‌యంలో చాలా మంది ఓపెన్ కులాల వారు త్వ‌ర‌లోనే జ‌రిగే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌నలో త‌మ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌రిగిన మంత్రి వ‌ర్గం ఏర్పాటులో రెడ్డి వ‌ర్గానికి, క‌మ్మ వ‌ర్గానికి కేవ‌లం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం.. అన్న‌ట్టుగా ప‌దవులు కేటాయించారు. రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు ఏకంగా 51 మంది ఉంటే… న‌లుగురికే ప‌ద‌వులు వ‌చ్చాయి. క‌మ్మ‌ల నుంచి ఒక్క కొడాలి నాని మాత్ర‌మే మంత్రిగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో మ‌రికొన్నాళ్ల‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు ప్రాధాన్యం పెంచాల‌ని.. రెడ్డి, క‌మ్మ నేత‌లు కోరుకుంటున్నారు. క‌మ్మ‌ల్లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు హామీ ఉంది. ఇక రెడ్డి వ‌ర్గం నేత‌ల్లో మంత్రి ప‌ద‌వులు ఆశిస్తోన్న వారి సంఖ్య‌కు లెక్కే లేదు. వీరు అయితే మూడు నుంచి నాలుగు ప‌ద‌వులు ఇవ్వాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు. “ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పెట్టేది మేం.. పార్టీ కోసం శ్ర‌మించేది మేం… కానీ, మాకు మాత్రం ఎప్పుడూ మొండి చెయ్యేనా?.. ” అని ఈ సామాజిక వ‌ర్గం వారు నిష్టూరంగా మాట్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ చేస్తున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ వ్య‌తిరేక ఫ‌లితం ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.