బాలయ్య కోసం ‘క్రాక్’ ఫార్ములానే


‘బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్’.. ఈ మధ్య టాలీవుడ్‌ను ఆకర్షిస్తున్న ఫార్ములా ఇది. మామూలుగా నిజ జీవిత ఘటనల నేపథ్యంలో సినిమాలంటే రియలిస్టిక్ మూవీసే తీస్తారు కానీ.. మాస్, కమర్షియల్ సినిమాలకు ఈ ఫార్ములాను పెద్దగా వాడుకోరు. ఐతే ఈ మధ్య ‘క్రాక్’ సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా తీసి దర్శకుడు గోపీచంద్ మలినేని భారీ విజయాన్నందుకున్నాడు. తన తర్వాతి సినిమాకు కూడా అతను ఇదే బాటలో వెళ్లబోతున్నాడు.

నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి భారీ సంస్థలో గోపీచంద్ తన తర్వాతి సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా గోపీచంద్ వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించబోతుండటం విశేషం. ‘క్రాక్’ సినిమాకు ఒంగోలు నేపథ్యాన్ని ఎంచుకుని, అక్కడ చాలా ఏళ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీశాడు గోపీచంద్. ఆ సినిమాలో విలన్‌గా కనిపించే కఠారి కృష్ణ పాత్ర వాస్తవంగా ఇప్పటికీ అక్కడ ఉండటం విశేషం. రవితేజ పాత్రను సైతం ఓ పోలీస్ అధికారి జీవితం స్ఫూర్తితోనే రాసుకున్నాడు గోపీచంద్.

ఇప్పుడు బాలయ్య సినిమాకు సైతం ఒంగోలు నేపథ్యాన్నే ఎంచుకున్నాడు గోపీచంద్. ఇది గోపీచంద్ స్వస్థలం కావడం విశేషం. బాలయ్య సినిమాకు స్క్రిప్టు తీర్చిదిద్దే క్రమంలో గోపీచంద్ ఒంగోలుకు వెళ్లిపోయాడు. అక్కడ వందేళ్ల చరిత్ర ఉన్న గ్రంథాలయంలో పాత పుస్తకాలను తిరగేస్తున్నాడు గోపీచంద్. లైబ్రరీలో గోపీచంద్ రీసెర్చ్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. బాలయ్య సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే.

‘క్రాక్’కు ముందు వరకు గోపీచంద్ సినిమాలు మరీ మూసగా అనిపించేవి. ‘క్రాక్’ సైతం మాస్ మసాలా సినిమానే అయినప్పటికీ.. అందులో హీరో, విలన్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంది. నిజ జీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొందడం వల్ల ఈ క్యారెక్టర్లకు జనం బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. మరి బాలయ్య సినిమాలో గోపీచంద్ ఇలాంటి విశేషాలు ఇంకెన్ని చూపిస్తాడో చూడాలి మరి.