జానాను ఉతికి ఆరేసిన కేసీఆర్‌

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో త‌న పార్టీ ఎవ‌రితో పోటీ ప‌డుతోందో.. కేసీఆర్ స్ప‌ష్టత ఇచ్చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి-టీఆర్ఎస్‌కు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం ఉంటుంద‌ని.. అనుకున్నా..ఎన్నిక‌ల ముంగిట‌కు వ‌చ్చేసరికి ఇక్క‌డ కాంగ్రెస్‌తోనే టీఆర్ఎస్ పోటీ ప‌డుతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. ఈ క్ర‌మంలో తాజాగా నిర్వ‌హించిన హాలియా బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ .. త‌న ప్రసంగం పూర్తిగా.. కాంగ్రెస్ నేత‌ల‌ను తిట్టిపోసేందుకు, ముఖ్యంగా కాంగ్రెస్ అభ్య‌ర్థి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జానా రెడ్డిని కేంద్రంగా చేసుకుని ఉతికి ఆరేశారు.

కేసీఆర్‌కు జానారెడ్డే సీఎం పదవి భిక్ష పెట్టాడని కొందరు అర్థం పర్థం లేని మాటలు అంటున్నారని కేసీఆర్‌ విమర్శించారు. తనకు సీఎం పదవిని ప్రజలే ఇచ్చారని‌ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం తానే పదవులు విసిరి పారేశానని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. పదవుల కోసం తెలంగాణను వదిలేసింది కాంగ్రెస్సేనని కేసీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ కోసం పదవులను వదిలేసింది కేవలం టీఆర్ఎస్‌ ఒక్కటే అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒంగి-లొంగి ఉండే నేత‌లు కాబ‌ట్టే..ప‌ద‌వుల కోసం పెద‌వులు మూసుకున్నారంటూ..త‌న‌దైన శైలిలో కాంగ్రెస్ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు కేసీఆర్‌.

“జానారెడ్డి నేను సీనియ‌ర్‌ను .. నాది బారు అంటాడు.. మ‌రి ఆ బారు ఇక్క‌డ అభివృద్ధికి ఏం చేసింది? ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కే ఏం మేలు చేసింది? ” అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. త‌న ఎన్నిక‌ల స‌భ‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేత‌లు కుయుక్తులు ప‌న్నార‌ని, బీజేపీ నేత‌లు కూడా తోడ‌య్యార‌ని.. మ‌రి నాలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ పెద్ద‌లు స‌భ‌లు నిర్వ‌హించ‌డం లేదా? ఎన్నిక‌ల ప్ర‌చారం చేసుకోవ‌డం లేదా? అని కేసీఆర్ నిల‌దీశారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌ను ఓట్లు అభ్య‌ర్థించ‌డం అనేది ఒక కీల‌క విష‌య‌మ‌ని పేర్కొన్న ఆయ‌న నోముల కుమారుడు.. భ‌గ‌త్ పేరు చెప్ప‌గానే చ‌ప్ప‌ట్లు ఈల‌లు మార్మోగాయ‌ని.. అయితే.. అవి ఓట్ల రూపంలో రేపు 17వ తారీకున బ్యాలెట్ల‌లో నిండిపోవాల‌ని ప్ర‌జ‌ల‌కు త‌న‌దైన శైలిలో పిలుపునిచ్చారు.

తెలంగాణ సాధించిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తున్నామ‌న్న కేసీఆర్ క‌ళ్యాణల‌క్ష్మి, రైతు బంధు, 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్తు వంటివి కాంగ్రెస్ త‌న 60 ఏళ్ల పాల‌న‌లో ఏనాడైనా ఇచ్చిందా? జానా రెడ్డి ఏం చెబుతాడు? ప‌క్క‌నే ఉన్న ప‌ల్లెలు.. పంచాయ‌తీ అనుకోవాలా. మునిసిపాలిటీ అనుకోవాలా?, అని కూడా చెప్ప‌లేని జానా వ‌ల్ల ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఏం ఒరిగింద‌ని కేసీఆర్ నిల‌దీశారు.

కులం, మ‌తం, జాతి అనే తేడా లేకుండా టీఆర్ఎస్ పార్టీ అంద‌రినీ ఆద‌రిస్తుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మంచి చేసే వాళ్ల‌ను ఆద‌రించి గెలిపిస్తే మంచి జ‌రుగుతుంద‌న్నారు. ఒక‌ప్పుడు తెలంగాణ అనాథ‌లా ఉండే. టీఆర్ఎస్ జెండా ప‌ట్టి తెలంగాణ సాధించామ‌న్నారు. ఆత్మ బ‌లంతో అడుగు ముందుకేసి ప్ర‌త్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామ‌ని పేర్కొన్నారు. దీక్ష విర‌మించ‌మ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. కానీ దీక్ష విర‌మించ‌లేదు. ‘కేసీఆర్ స‌చ్చుడో.. తెలంగాణ తెచ్చుడో’ అని దీక్ష ప‌ట్టి తెలంగాణ సాధించాం. ఓటేసే ముందు మీ అంద‌రూ ఆలోచించాలి. కేసీఆర్ రావొద్దు. స‌భ జ‌ర‌గొద్దు అని హైకోర్టుకు, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఇవ‌న్నీ ఎందుకు చేశారో.. మీరు ఆలోచించాలి. ఇవ‌న్నీ మీకు తెలుసు. ఇవాళ ఉద్యోగ‌స్తుల‌కు కూడా జీతాలు పెంచామ‌న్నారు. అంద‌రి క‌డుపులు నింపుతున్నామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెన్ష‌న్లు రూ. 200 ఇస్తే.. తాము ఆస‌రా పెన్ష‌న్ల కింద ఒక్కో ల‌బ్ధిదారుడికి రూ. 2016 ఇస్తున్నామ‌ని తెలిపారు. గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా వ‌స్త‌లేదా, క‌ల్యాణ‌ల‌క్ష్మి వ‌స్త‌లేదా. గ‌తంలో ఇవ‌న్నీ ఉండేనా. గ‌తంలో రైతు చ‌నిపోతే ప‌రిహారం ఇచ్చే విష‌యంలో కూడా దారుణాలు చేసేవారు. ఇప్పుడు గుంట భూమి ఉన్న‌ రైతు చ‌నిపోయినా.. రైతు బీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నాం. ఏ పైర‌వీ లేకుండా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో భూముల రిజిస్ర్టేష‌న్ చ‌క‌చ‌కా జ‌రిగిపోతోంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో చ‌రిత్ర సృష్టించామ‌న్నారు. ఫ్లోరైడ్‌తో బాధ‌ప‌డుతున్న ఈ జిల్లాకు మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు తీసుకొచ్చాం.

“ఏమాయేనే న‌ల్ల‌గొండ‌.. ఏడుపే నీ గుండె నిండా” అని తానే పాట రాసిన‌ట్టు కేసీఆర్ చెప్పారు. ” త‌న‌ 30 ఏండ్ల చ‌రిత్ర‌లో జానారెడ్డి ఏం చేయ‌లేదు. కృష్ణా న‌ది ఒడ్డున ఉన్న గ్రామాల‌కు కూడా గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వ‌లేదు. ఇవాళ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా వ‌చ్చే న‌ల్లా నీళ్ల‌లో మీకు కేసీఆర్ క‌న‌బ‌డుత లేడా. 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ‌ను కాంగ్రెస్ నాయ‌కులు నాశ‌నం చేశారు. ఇప్పుడు క‌రెంటు స‌మ‌స్య లేదు. రైతులకు నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. పేద‌ల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టా”మని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.