జగన్-కేసీఆర్ ‘నీటి’ చిచ్చు: పరిష్కారం అంత సులభం కాదా?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీ వచ్చింది. గతంలో చంద్రబాబు-కేసీఆర్ మధ్య విభేదాలు సహజంగా కనిపించాయి. సెక్షన్ 8 నుండి మొదలు పెడితే హైకోర్టు విభజన, విద్యుద్ ఉద్యోగుల విభజన, 9, 10వ షెడ్యూల్.. ఎలా ఎన్నో అంశాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్రమైన విభేదాలు కనిపించాయి. ఆ సమయంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్-కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లుగా చాలామంది భావించారు. ఎన్నికల తర్వాత కూడా చాలాకాలం వరకు ఇలాగే కొనసాగింది.

చంద్రబాబు-కేసీఆర్ మధ్య రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలకు రాజకీయ వైరం తోడయిందనేది చాలామంది అభిప్రాయం. ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఎన్నో సమస్యలు అంత సులభంగా కాకపోయినప్పటికీ.. జగన్-కేసీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల సామరస్యంగా పరిష్కారమవుతాయని భావించినవారు ఎంతోమంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు తమ తమ రాష్ట్రాల కోసం పని చేసే క్రమంలో ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఇబ్బందులు తప్పవని, ప్రతి సమస్యని సామరస్యంగా పరిష్కరించడం అంత సులువైన విషయం ఏమీ కాదని తేటతెల్లమైందంటున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షమని, ఇది ఏపీ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ సర్కార్ చేసిన తప్పిదాలు అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. దీనిపై వెంటనే కృష్ణా ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పరస్పరం సహకారంతో ముందుకు సాగుదామని తాము చెబుతుంటే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తోందన్నారు. వాటాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సంవత్సరం 800 టీఎంసీల నీరు సముద్రం పాలయిందని, ఈ నేపథ్యంలో వరదనీరు దుర్వినియోగం కాకుండా ఉండేలా ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామనేది ఏపీ అభిప్రాయం.