అమ్మకానికి విశాఖ సర్కారీ భూములు.. రూ.1500 కోట్లే లక్ష్యం

తీవ్రమైన ఆర్థిక ఒడిదుడికుల్లో ఉన్న ఏపీ రాష్ట్ర సర్కారు.. ఆదాయ వనరు కోసం విపరీతంగా గాలిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. రానున్న రోజుల్లో పరిపాలనా రాజధానిగా భావిస్తున్న వివాఖపట్నంలో ఖరీదైన ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టేసింది. బీచ్ రోడ్డు లోని 13.59 ఎకరాలతోపాటు.. మొత్తం 18 ఆస్తుల్ని అమ్మకానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

వాస్తవానికి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే బీచ్ రోడ్డు మార్గాన్ని ఆనుకొని ఉన్న 18 ఎకరాల్లో లూలూ సంస్థ భారీ కన్వెన్షన్ సెంటర్ తో పాటు.. మాల్ తదితరాల్ని డెవలప్ చేయటానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఆ డీల్ నుంచి వైదొలిగింది. దీంతో.. ఆ స్థలం ప్రభుత్వవశమైంది. తాజాగా ఆ భూమికి రూ.1452 కోట్లుగా రిజర్వు ధరను నిర్ణయించింది.

అంతేకాదు.. మరో 17 భూముల్ని కూడా అమ్మాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద కొన్ని భూముల్ని అమ్మాలని నిర్ణయించిందని.. ఆయా స్థలాల్ని ప్రభుత్వం తరఫున తాము ఈ-వేలం వేయనున్నట్లుగా ఎన్ బీసీసీ సంస్థ వెల్లడించింది. విలువైన ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే.. రానున్న రోజుల్లో ఎదురయ్యే అవసరాలకు ప్రభుత్వం వద్ద ఇంకేం మిగులుతుంది?

కొసమెరుపు : 2006 లో ఒకసారి వైజాగ్ లో ప్రభుత్వ భూములు అమ్మారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ మళ్లీ అమ్మలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వైజాగ్ లో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు.