కేసీఆర్ ‘ఫ్యామిలీ’ని టచ్ చేసిన షర్మిల

పార్టీ పెట్టలేదు కానీ.. రోజుకో కార్యక్రమాన్నిపక్కాగా నిర్వహిస్తూ.. ఏదో ఒక రీతిలో మీడియాలో తన పేరు వినపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. అయితే జిల్లాల నుంచి.. లేదంటే హైదరాబాద్ కు చెందిన ఎవరో ఒకరు తనతో భేటీ అయ్యేలా ఆమె చేస్తున్న ప్లానింగ్ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తాజాగా ఆమెను మాజీ డీజీపీ సర్వరణ్ జీత్ సేన్ భేటీ అయ్యారు. తన భార్యతో కలిసి ఆయన.. లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి.. పలు అంశాల్ని చర్చించారు.

ఇదిలా ఉంటే.. ఎప్పుడు లేని రీతిలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అంశాల్ని నిర్మోహామాటంగా ప్రస్తావించారు షర్మిల. ఓవైపు నిరుద్యోగులుఆత్మహత్య చేసుకుంటున్న వేళ.. అదే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇరుకున పడేలా షర్మిల వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని.. కేసీఆర్ ఒక్క ఫ్యామిలీలోనే ఐదు జాబులు ఇచ్చుకున్నారంటూ విమర్శనాస్త్రాన్ని సంధించారు.

నిరుద్యోగులు అధైర్యపడొద్దన్న ఆమె.. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 250 మంది యువకులతో సమావేశమయ్యారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబ్బు లేదని చదువులుమధ్యలో ఆపేయటం ఉండదని.. అందరికి ఫీజురీయింబర్స్ మెంట్ కల్పిస్తామన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ప్రభుత్వం మీదా.. ఆయన వ్యక్తిగతం మీదా విమర్శలుసంధిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు షర్మిల చేసిన విమర్శలపై స్పందించని.. తెలంగాణ అధికార పక్ష నేతలు.. తాజాగా విమర్శపైన అయినా స్పందించారా? మిన్నకుండా ఉండిపోతారా? అన్నది ప్రశ్న. ఏమైనా కేసీఆర్ ఫ్యామిలీని సింఫుల్ గా టచ్ చేసిన షర్మిల ధైర్యాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరి..ఈ లెక్కన రేపటి బహిరంగ సభలో సర్కారుకు మరెన్ని చురకలు వేస్తారో చూడాలి.