హైకోర్టు సూటి ప్రశ్న: బార్లు.. పబ్ లు.. థియేటర్లపై ఆంక్షలు లేవేం

చాలా రోజుల తర్వాత కరోనా పరిస్థితులు.. కేసుల నమోదుపై తెలంగాణ హైకోర్టు తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు.. చికిత్స.. నియంత్రణపై నివేదికను ప్రభుత్వం సమర్పించింది. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు సూటిగా పలు ప్రశ్నల్ని సంధించింది. బార్లు.. పబ్ లు.. సినిమా థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న ప్రభుత్వం.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువ చేయటంపై హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్ని నెమ్మదిగా పెంచుతున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలుపగా.. హైకోర్టు అందుకు భిన్నంగా స్పందించింది. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తుంటే.. నెమ్మదిగా పెంచటం ఏమిటంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు పూర్తిగా ర్యాపిడ్ టెస్టుల మీదనే ఫోకస్ పెట్టిందని.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పది శాతం కూడా లేవని పేర్కొంది.

వివాహాలు.. శుభకార్యాల్లోనూ.. అంత్యక్రియల్లోనూ జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. రద్దీ ప్రాంతాల్లో చేపట్టిన పరీక్షల వివరాల్ని తెలపాలని కోరింది. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్న కోర్టు.. నిబంధనల్ని పాటించని వారిపై నమోదైన కేసులు.. జరిమానాల్ని వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు అడిగిన పలు ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం ఏమని బదులిస్తుందో చూడాలి.