వామ్మో.. విజువల్ ఎఫెక్ట్స్‌కే 250 కోట్లు

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ పెద్ద డిజాస్టర్. దీని తర్వాత అతడి నుంచి రానున్న ‘రాధేశ్యామ్’కు ఆశించినంత బజ్ లేదు. ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో నమ్మకాలు తక్కువే ఉన్నాయి. ఐతే ఈ ప్రభావం ప్రభాస్ తర్వాతి చిత్రాల మీద పెద్దగా కనిపించడం లేదు. ప్రభాస్ లైన్లో పెట్టిన మూడు చిత్రాలకూ మంచి క్రేజ్ ఉంది. నిర్మాతలు ప్రభాస్ మీద ఎంత భరోసా ఉందో చెప్పడానికి ఆయా చిత్రాలకు పెడుతున్న ఖర్చే నిదర్శనం. ‘సలార్’ రెగ్యులర్ యాక్షన్ మూవీనే కాబట్టి మరీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

కానీ దాని తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ చిత్రాలకు మాత్రం భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఇవి రెంటికీ కలిపి దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ‘ఆదిపురుష్’ బడ్జెట్ మొదట రూ.400 కోట్లని అన్నారు కానీ.. సినిమా పూర్తయ్యేసరికి ఆ మొత్తం రూ.500 కోట్లు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఇండియన్ సినిమా చరిత్రలోనే వీఎఫ్ఎక్స్ కోసం అత్యధిక ఖర్చు చేయనున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించనున్నట్లు సమాచారం.

‘ఆదిపురుష్’ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను తీసుకుంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. రామాయణ గాథను ఇంతకుముందు అందరూ తీసినట్లే తీస్తే ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోకపోవచ్చు. ఇప్పటి సాంకేతికతను ఉపయోగించుకుని ఆడియన్స్‌కు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్నది మేకర్స్ ఉద్దేశం. అందుకే ఏమాత్రం రాజీ లేకుండా వీఎఫ్ఎక్స్ కోసం ఏకంగా రూ.250 కోట్లు పెట్టబోతున్నారట. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం దాదాపు ఏడాది సమయం వెచ్చించబోతున్నారట.