ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో విజయం ఎవరిది?

ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ సంస్థ నిర్వహించిన తాజా సర్వే ఫలితాల్ని వెల్లడించింది. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి తాను చేపట్టిన ఓపినియన్ పోల్ వివరాల ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదురాష్ట్రాల్లో ఒక్క అసోంలో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల అనంతరం మరో బుల్లి రాష్ట్రంలో బీజేపీ పాగా వేయనుందని తేల్చింది.

నాలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రానుందన్న విషయానికి వస్తే..

తమిళనాడు
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఈసారి డీఎంకే – కాంగ్రెస్ తో ఉన్న మిత్రపక్షాల కూటమి ఘన విజయం సాధించటం ఖాయమని తేలుతోంది. అదే సమయంలో అధికార అన్నాడీఎంకే.. బీజేపీతో కూడిన మిత్రపక్షాలకు దారుణ అపజయం ఎదురుకానున్నట్లు వెల్లడించింది. కమల్ హాసన్ పార్టీతో సహా మిగిలినరాజకీయ పార్టీలకు ఏ మాత్రం సీట్లు వచ్చే అవకాశం లేదని తేల్చింది. తాజా సర్వే ప్రకారం డీఎంకే కాంగ్రెస్ తో కూడిన ఇతర మిత్రపక్షాలు ఏకంగా 173 నుంచి 181 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో అన్నాడీఎంకే.. బీజేపీతో కూడిన ఇతర మిత్రపక్షాలకు కేవలం 45 నుంచి 53 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకోనుంది.. ఏఎంఎంకే.. ఎంఎన్ఎం.. ఇతరులు ఎవరికి వారిగా 1-5 స్థానాల్లో విజయం సాధించే వీలున్నట్లుగా పేర్కొన్నారు.

కేరళ
మొత్తం 140 స్థానాలున్న కేరళలో మరోసారి వామపక్ష కూటమిదే అధికారంగా తేల్చారు. పినరయి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తున్నట్లుగా తాజా సర్వేలో తేలింది. కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాల కూటమి అయిన యూడీఎఫ్ కు గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగినా అధికారాన్ని మాత్రం సొంతం చేసుకోలేదని తేల్చారు. అధికార ఎల్ డీఎఫ్ కు 77సీట్లు సొంతం కానున్నాయి. అదే సమయంలో యూడీఎఫ్ 62 సీట్లకే పరిమితమై విపక్ష స్థానానికి పరిమితం కానుంది.

అసోం
126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసోం రాష్ట్రంలో అధికార బీజేపీ.. తన బలాన్ని నిలుపుకోనుంది. తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోనుంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో స్వల్ప అధిక్యతతో అయినా బీజేపీ తన పట్టును నిలుపుకుంటుందని.. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తాజా సర్వే స్పష్టం చేసింది. ఎన్డీయే కూటమికి కాంగ్రెస్ నేత్రత్వంలోని మహాజోత్ కూటమి గట్టి పోటీని ఇచ్చినప్పటికి తుది ఫలితం మాత్రం ఎన్డీయేకే అనుకూలంగా రానున్నట్లు తేల్చారు. ఎన్డీయే 65 నుంచి 73 స్థానాల్ని సొంతం చేసుకోనుంటే.. మహాజోత్52 స్థానాల నుంచి 60 స్థానాల మధ్యలో గెలవనుంది. ఇతరులు నాలుగు స్థానాల వరకు గెలిచే వీలున్నట్లు సర్వే పేర్కొంది.

పుదుచ్చేరి
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆత్రుతగా ఉన్న బీజేపీకి ఈసారి ఎన్నికలు మరో బుల్లి రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోనున్నట్లు టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేస్తోంది. కేవలం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఈసారి ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని సాధించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి విపక్ష పాత్ర పోషించనుంది. సర్వే ఫలితం ప్రకారం ఎన్డీయేకు 19 నుంచి 23 స్థానాల్లో విజయం సాధించే వీలుందని తేల్చారు. కాంగ్రెస్ – డీఎంకే కూటమి ఏడు నుంచి పదకొండు స్థానాలకు పరిమితం కానున్నట్లు వెల్లడించారు. మరి.. తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.