విశాఖకు కొత్త రూపు.. జగన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటం కోసం మహా మొండిగా పని చేసే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాజాగా తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. తాను చెప్పిన మూడు రాజధానుల అంశంపై తాజాగా ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజధాని నగరంగా విశాఖను మార్చేందుకు వీలుగా.. ముందస్తు ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. విశాఖ రూపును సమూలంగా మార్చేసే పనిని తాజాగా చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం జగన్ సర్కారు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

విశాఖ జిల్లాలోని గిరిజనేతర ప్రాంతం మొత్తాన్ని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో నర్సీపట్నం.. చోడవరం.. మాడుగుల.. రావికమతం.. బుచ్చయ్యపేట.. నాతవరం.. కె.కోటపాడు.. దేవరపల్లి.. మాకవరపాలెం.. కోటవురట్ల.. గొలుగొండ.. రోలుగుంట.. చీడికాడ మండలాల పరిధిలోని 431 గ్రామాల్ని.. 2,280.19 చదరపు కిలోమీటర్ల భూమిని దీని కిందకు తీసుకొచ్చింది.

విశాఖ జిల్లాలో మొత్తం 43 మండలాలు ఉంటే.. అందులో 19 మండలాలు ఇప్పటికే దీని పరిధిలో ఉండగా.. పదకొండు మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. వీటిని మినహాయించి మిగిలిన 13 మండలాల్లోని అన్ని గ్రామాల్ని వీఎంఆర్డీఏలో విలీనం చేశారు. అంతేకాదు.. విశాఖ రూపును మరింత మార్చేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

బీచ్ కారిడార్ తో పాటు.. భోగాపురం విమానాశ్రయం.. పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్ ద్వారా విశాఖకు తరలించే అంశంపైనా మరింత ఫోకస్ పెట్టాలన్నారు. వీటి తర్వాత మెట్రో ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. విశాఖ నుంచి భీమిలి వరకున్న బీచ్ రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు. భీమిలి నుంచి భోగాపురం వరకు రోడ్డునిర్మాణంతో పాటు భూసేకరణకు కోసం రూ.1167 కోట్లు ఖర్చు అవుతుందన్న లెక్కలు వేసిన సర్కారు.. రానున్న 30 ఏళ్లలో విశాఖ నీటి అవసరాలు తీర్చేలా పైపులైను ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలుజారీ చేశారు. మొత్తంగా విశాఖ రూపురేఖల్ని మార్చేసే యోచనలోజగన్ ఉన్న విషయం తాజా నిర్ణయాలతో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.