అభ్యర్ధులను సీనియర్లే పట్టించుకోలేదా ?

ఇపుడిదే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. గెలిచేస్తాం..పొడిచేస్తాం…అంటు మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాల హడావుడే చేశారు. తీరా చూస్తే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏమిటో తేలిపోయింది. 98 డివిజన్లలో కమలంపార్టీ గెలిచింది కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్లో మాత్రమే. ఎంతో నమ్మకం, ఆశలు పెట్టుకున్న విశాఖలోనే పార్టీకి ఎందుకింత దీనస్ధితి వచ్చింది ?

ఎందుకంటే పార్టీలో సీనియర్లే సొంత అభ్యర్ధులను పట్టించుకోలేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నుండి రెండుసార్లు విశాఖపట్నం ఎంపిగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన దగ్గుబాటి పురందేశ్వరి ఎక్కడా కనబడలేదట. ప్రస్తుతం పురందేశ్వరరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయినా అభ్యర్ధుల తరపున ఆమె ప్రచారం చేయలేదట.

అలాగే ఒకసారి ఎంపిగా గెలిచిన కంభంపాటి హరిబాబు కూడా అడ్రస్ కనబడలేదు. ఈయన గతంలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశారు. వీళ్ళిద్దరే కాకుండా సీనియర్ నేతలు చాలామందే ఉన్నా ఎక్కువమంది పార్టీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేయలేదట. సొంతపార్టీ అభ్యర్ధుల కోసమే కష్టపడనివారు ఇక మిత్రపక్షం జనసేన అభ్యర్ధులను పట్టించుకుంటారా ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ సీనియర్లు అభ్యర్ధుల తరపున ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. అంటే సీనియర్లందరు పనిచేసేస్తే జీవీఎంసీ పీఠాన్ని బీజేపీ గెలిచుండేదని కాదు. కానీ కనీసం గౌరవప్రదంగా కొన్ని డివిజన్లలో అయినా గెలిచేది కదాని పార్టీలో చర్చ జరుగుతోంది.