ఆర్కే రూపంలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి కొత్త టానిక్‌!

దాదాపు 458 రోజులుగా సాగుతున్న అమ‌రావ‌తి ఉద్య‌మానికి వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి(ఆర్కే) కొత్త ఊతం ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్య‌మిస్తున్న రైతుల‌కు ఆయ‌నే స్వ‌యంగా కొన్ని కొత్త అస్త్రాల‌ను అందించారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి భూముల విష‌యంలో ఎస్సీ, ఎస్టీల‌కు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని ఆరోపిస్తూ.. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మ‌రో మంత్రి నారాయ‌ణ‌ల‌పై సీఐడీకి ఫిర్యాదు చేయ‌డం.. కోర్టు దాకా విష‌యాన్ని తీసుకువెళ్ల‌డం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కోర్టు ఈ సీఐడీ విచార‌ణ‌పై నాలుగు వారాల పాటు స్టే విధించింది. అయితే..ఇక్క‌డ ఆర్కే లేవ‌నెత్తిన వివిధ అంశాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఉద్య‌మం చేస్తున్న రైతుల‌కు కొత్త ఆయుధాలు ల‌భించిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా.. సీఆర్‌డీఏ చ‌ట్టం ప్ర‌కారం.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందాల‌ను త‌దుప‌రి వ‌చ్చే ప్ర‌భుత్వాలు గౌర‌వించాలి. అంతేకాదు.. రైతుల‌కు ఇవ్వాల్సిన పింఛ‌న్లు, న‌ష్ట‌ ప‌రిహారం వంటివాటిని పెండింగ్ ఉంటే వాటిని ఇచ్చి తీరాలి. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని నిలుపుద‌ల చేసింది. ఇక‌, ఇప్పుడు వీటి కోసం రైతులు గ‌ళం వినిపించే అవ‌కాశం చిక్కింది.

అదే విధంగా.. ఎస్సీ, ఎస్టీ భూముల‌ను రాజ‌ధాని నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఎస్సీ, ఎస్టీ హ‌క్కుల‌కు ఎలాంటి భంగం క‌లిగించ‌రాద‌ని/ క‌లిగించ‌డం లేద‌ని కూడా చ‌ట్టంలో పేర్కొన్నా రు. దీనిని బ‌ట్టి రాజ‌ధానిలోని ఎస్సీ, ఎస్టీ రైతుల‌పై ఎలాంటి వేధింపుల‌కూ పాల్ప‌డ‌రాద‌ని చ‌ట్టం నిర్దేశి స్తోంది. కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం అడుగ‌డుగునా.. వీరిపై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆర్కే లేవ‌నెత్తిన అంశ‌మే ఆలంబ‌న‌గా త‌మ‌పై జ‌రుగుతున్న వేధింపు లు, కేసుల న‌మోదు ప్ర‌క్రియ వంటివాటిపై రైతులు కోర్టుల‌ను ఆశ్ర‌యించే అవ‌కాశం ల‌భించింది.

ఇక‌, ఆర్కే లేవ‌నెత్తిన మ‌రో ముఖ్య‌మైన అంశం.. ప్ర‌జాప్ర‌తినిధులు.. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌ను వేధించరాద‌ని. ఇలా వేధించే గ‌త ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల నుంచి భూములు ద‌క్కించుకుంద‌ని ఆరోపించారు. కానీ, వాస్త‌వానికి తాజాగా సీఐడీ ముందు వాంగ్మూలం ఇచ్చిన రైత‌న్న‌లు.. త‌మ‌ను గ‌త ప్ర‌భుత్వం వేధించ‌లేద‌ని చెప్పారు. అయితే.. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతమున్న వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు.. రైతుల‌ను ఏ విధంగా వేధిస్తున్నారో.. తెలిసిందే.

ముఖ్యంగా ఇక్క‌డ ఉద్య‌మం చేస్తున్న రైతుల‌ను పెయిడ్ ఆర్టిస్టుల‌ని.. వారిని చంద్ర‌బాబు ప్రోత్స‌హిస్తు న్నార‌ని.. అస‌లు ఉద్య‌మ‌మే లేద‌ని.. విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి వారు.. త‌మ‌కు చ‌ట్ట ప‌రంగా అంది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కేనే లేవ‌నెత్తిన‌.. విష‌యం ఆధారంగా.. వైసీపీ ప్రజాప్రతినిధుల పైన కేసు వేసే అవకాశం దొరికింది. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను వేధించ‌డం.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా కేసులు న‌మోదు చేయ‌డం వంటివాటిని కోర్టులో స‌వాల్ చేసే అవ‌కాశం ఆర్కేనే క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. రాజ‌ధాని రైతుల‌కు ఆర్కే రూపంలో కొత్త టానిక్ ల‌భించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.