ఆ రెండు కలిస్తే.. వైసీపీకి దెబ్బేనా?

ఏపీ పుర ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. అధికార వైసీపీ విజయదుందుబి మోగించటం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. పవన్ కల్యాణ్ జనసేనలు చతికిలపడ్డాయి. ఈ ఎన్నికల్లో అంతో ఇంతో తన ఉనికిని చాటుతానని భావించిన టీడీపీ.. అలాంటిదేమీ చేయలేకపోయింది. అయితే.. వెల్లడైన ఫలితాలను విశ్లేషిస్తే.. ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తాజా ఫలితాలు చూసినప్పుడు ఏపీ అధికారపక్షానికి ఎదురే లేదన్న భావన కలుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేదనే అనిపిస్తుంది. కానీ.. లోతుల్లోకి వెళితే.. అసలు నిజాలు కనిపిస్తాయి.

వైసీపీకి ఇంతటి ఘన విజయానికి కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయవంతంగా చీల్చటమేనని చెప్పాలి. అదెలా అంటే.. విపక్ష తెలుగుదేశం.. జనసేనలకు విడివిడిగా వచ్చిన ఓట్లను ఒకటి చేస్తే.. అధికార వైసీపికి మించిన ఓట్లు వచ్చినట్లుగా తేలుతుంది. అంటే.. వంద ఓట్లు పోలైతే.. 45 ఓట్లు సాధించిన వైసీపీ విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకంగా పడిన 55 ఓట్లు తెలుగుదేశం.. జనసేనలు చీల్చుకోవటంతో.. వైసీపీ భారీ ప్రయోజనాన్ని పొందింది. అలా అని ఏపీ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పట్లేదన్నది మర్చిపోకూడదు. స్థానిక సంస్థలు కావటం.. అధికార పార్టీకి ఉండే వెసులుబాటు.. విపక్షాలకు ఉండే పరిమితులతోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు.. సార్వత్రిక ఎన్నికలే అయితే.. ఫలితం మరో తీరులో ఉంటుందని చెప్పక తప్పదు.

క్రిష్ణా జిల్లా విషయానికే వస్తే.. ఐదు మునిసిపాలిటీలు ఉన్న వైసీపీ.. టీడీపీ మధ్య లక్ష ఓట్ల తేడా ఉంది. అదే సమయంలో ఈ జిల్లాలో జనసేనకు 50వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నగరంలో 16 డివిజన్లలో జనసేన కారణంగా టీడీపీ గెలుపు అవకాశాల్ని దెబ్బ తీసింది. అదే.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ఇప్పుడు వచ్చిన ఫలితం తారుమారు అయ్యే పరిస్థితి.

ఒకవేళ టీడీపీ.. జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే.. వీరికి ఇప్పుడు పడిన ఓట్ల కంటే ఎక్కువగా పడేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. గెలిచే పార్టీకి ఓటు వేసే వారు ఉంటారన్నది మర్చిపోకూడదు. అంతేకాదు.. గెలుపుధీమా పాజిటివ్ ఓటును మరింత ఎక్కువగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింత బలంగా పడే వీలుంది. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. ఆ పార్టీ కంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పుర ఫలితాలు మరోలా ఉండేవన్న మాట వినిపిస్తోంది.

విశాఖ జిల్లాలోని విశాఖ మహానగర పాలక సంస్థతో పాటు.. రెండు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్ని చూస్తే.. ఈ జిల్లాలో వైసీపీ కంటే ప్రతిపక్షాలకు ఎక్కువ ఓట్లు లభించటం గమనార్హం. ఈ జిల్లాలో వైసీపీ 4.64 లక్షల ఓట్లను సాధిస్తే.. టీడీపీకి 3.87లక్షల ఓట్లు.. జనసేనకు 82వేల ఓట్లు వచ్చాయి. అంటే..ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే.. వైసీపీకి కంటే ఎక్కువన్న మాట. బీజేపీకి కేవలం 35 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవటంతో.. ఏపీ అధికారపక్షం విజయాన్ని నమోదు చేసుకుంది. ఏపీలోని కోస్తా.. ఉత్తరాంధ్రలో జనసేన తన బలాన్ని చాటింది కానీ.. రాయలసీమలో మాత్రం ఆ పార్టీ తన ఉనికిని చాటుకోలేకపోవటం గమానార్హం.